కర్నూలు బస్సు ప్రమాద దుర్ఘటన రెండు తెలుగు రాష్ట్రాలలో పెను విషాదాన్ని నింపింది. తెల్లవారుజామున జరిగిన ఘోరం.. ఎన్నో కుటుంబాల్లో తీరని వేదనను, ఎంతో మంది బతుకులలో.. చీకట్లను మిగిల్చింది. రోడ్డుపై పడి ఉన్న బైక్ను ఢీకొని.. మంటలు చెలరేగిన వెంటనే బస్సు డ్రైవర్ ప్రయాణికులను అప్రమత్తం చేసి ఉంటే.. చాలా మంది ప్రాణాలతో బయటపడే వారనే వాదనలు వినిపిస్తున్నాయి. అలాగే కర్నూలు కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదంతో అసలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులలో ఏం జరుగుతోందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు కేవలం ధనార్జనకే ప్రాధాన్యం ఇస్తున్నాయా.. ప్రయాణికుల భద్రతను పట్టించుకోవడం లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు నిబంధనల ప్రకారం బస్సులను నడుపుతున్నాయా లేదా అనే దానిపై ఏపీ రవాణా శాఖ దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది.
ఏపీ రవాణా శాఖ కమిషనర్ మనీశ్ కుమార్ సిన్హా ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రెండు రోజులుగా ఏపీ రవాణా శాఖ ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగిస్తోంది. ఈ రెండు రోజులలో ఇప్పటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా 361 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు. ఈ బస్సులు అన్నీ నిబంధనలు ఉల్లంఘిస్తూ తిరుగుతున్నట్లు గుర్తించారు. మరోవైపు మొత్తం 40 ప్రైవేట్ బస్సులను రవాణా శాఖ అధికారులు సీజ్ చేశారు. అలాగే ఎలాంటి అనుమతి తీసుకోకుండానే 63 ట్రావెల్స్ బస్సులు సీటింగ్ మార్పులు చేసినట్లు గుర్తించారు. వీటితో పాటు బస్సులలో ఫైర్ సేఫ్టీ పరికరాలను ఏర్పాటు చేయని బస్సులపై భారీగా జరిమానాలు విధించారు.
మరోవైపు ఏపీ రవాణా శాఖ చేపడుతున్న స్పెషల్ డ్రైవ్లో అనేక విషయాలు వెలుగుచూస్తున్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ బాగోతం బయటపడుతోంది. ఈ తనిఖీల్లో 83 బస్సులు ఫైర్ సేఫ్టీ పరికరాలు లేకుండానే తిరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. వీటిపై కేసులు నమోదు చేసి, జరిమానాలు విధించారు చేశారు. అలాగే ఎమర్జెన్సీ ఎగ్జిట్లు లేని 11 బస్సులపైనా కేసులు నమోదు చేశారు.14 బస్సుల్లో ఫైర్ అలారం, రక్షణ వ్యవస్థ లేనట్లు గుర్తించారు. అలాగే అనుమతి లేకుండానే గూడ్స్, పార్సిళ్లు చేరవేస్తున్న 11 బస్సులను గుర్తించి జరిమానా విధించారు.
మరోవైపు ఏపీ రవాణా శాఖ ప్రైవేట్ బస్సులపై రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన స్పెషల్ డ్రైవ్లో 361 ప్రైవేట్ బస్సులపై కేసులు నమోదు కాగా.. అందులో అత్యధికంగా నంద్యాల జిల్లాలో 66 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఎన్డీఆర్ జిల్లాలో 42, పల్నాడు జిల్లాలో 36, ప్రకాశం జిల్లాలో 34 ప్రైవేట్ బస్సులపై కేసులు నమోదు చేశారు. తిరుపతి జిల్లాలో 25, అన్నమయ్య జిల్లాలో 21, కర్నూలు జిల్లా 14, చిత్తూరు జిల్లాలో 8 ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు. తనిఖీలతో పాటుగా ప్రమాదాలు జరిగితే అత్యవసర ద్వారాల నుంచి ఎలా బయటపడాలనే దానిపై ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa