ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్టోబర్ 28న తలపెట్టిన నిరసన ర్యాలీలను నవంబర్ 4కు వాయిదా .. మనసు మార్చుకున్న వైసీపీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 26, 2025, 07:24 PM

ఆంధ్రప్రదేశ్ వైపు మొంథా తుపాను దూసుకువస్తోంది. తుపాను ప్రభావంతో ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమై.. ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతోంది. మరోవైపు మొంథా తుపాను నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. మొంథా తుపాను నేపధ్యంలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. అలాగే ఏపీ ప్రభుత్వం మెడికల్‌ కాలేజ్‌లు ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ అక్టోబర్‌ 28వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలలో వైసీపీ తలపెట్టిన ర్యాలీలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.


మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను నిరసిస్తూ తలపెట్టిన ర్యాలీలను నవంబర్‌ 4 వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు వైసీపీ ప్రకటించింది. మొంథా తుపాను నేపధ్యంలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు అండగా ఉండాలని వైఎస్ జగన్ సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు, సహాయ, పునరావాస చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.


మొంథా తుపాను ప్రభావం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..


మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతంలోని తీవ్రవాయుగుండం మరికొన్ని గంటల్లో తుపానుగా బలపడుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మంగళవారం ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది. మంగళవారం సాయంత్రం తీరం దాటే అవకాశం ఉందన్న ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ.. దీని ప్రభావంతో సోమవారం రోజున ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అలాగే మిగతా జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.


మరోవైపు తుపాను ప్రభావంతో మంగళవారం రోజున శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అలాగే కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లోనూ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa