మొంథా తుపాను ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో నేటి నుంచి బుధవారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 28న తుపాను కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని తెలిపారు. ప్రస్తుతం దుబాయ్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొంథా తుపాను నేపథ్యంలో అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపానును ఎదుర్కోవడానికి అధికారులు సిద్ధంగా ఉండాలని తెలిపారు. సముద్రంలో వేటకు వెళ్లిన వారిని వెనక్కి రప్పించాలని తెలిపారు.
దుబాయ్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, 'మొంథా' తుఫాన్ ముప్పు నేపథ్యంలో అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపానును ఎదుర్కోవడానికి అధికారులంతా సిద్ధంగా ఉండాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. తుపాను నేపథ్యంలో ఆ ప్రభావిత ప్రాంతాల్లో.. కరెంట్, టెలికాం, తాగునీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా చూడాలని, తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. తుపాన్ వల్ల కలిగే నష్టాలను వెంటనే పరిష్కరించాలని.. సముద్రంలో ఉన్న పడవలను వెనక్కి రప్పించాలని ఆయన సూచించారు. ఈ తుపాన్ సన్నాహక చర్యలను పర్యవేక్షించడానికి, జిల్లాల వారీగా సీనియర్ IAS అధికారులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించి, కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు.
'మొంథా' తుఫాన్ రాష్ట్రంపైకి దూసుకొస్తున్న నేపథ్యంలో, ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడి, క్రమంగా పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ ఆదివారం నాటికి తీవ్ర వాయుగుండంగా, సోమవారం నాటికి తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
తుఫానును ఎదుర్కోవడానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, సహాయక చర్యలు, పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. తుపాను వల్ల కలిగే నష్టం అంచనా, పరిహారం, దాని పంపిణీ, పునరుద్ధరణ పనులు పూర్తయ్యే వరకు ప్రత్యేక అధికారులు తమ విధులను సక్రమంగా కొనసాగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ప్రస్తుతం, వాయుగుండం విశాఖపట్నానికి 920 కి.మీ, కాకినాడకు 920 కి.మీ, పోర్టుబ్లెయిర్కు 510 కి.మీ, చెన్నైకి 890 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది క్రమంగా బలపడి తుపానుగా మారే అవకాశం ఉన్నందున, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులను వెంటనే వెనక్కి రప్పించేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తుపాన్ కారణంగా రహదారులు, కాలువ గట్లు, చెరువులు దెబ్బతింటే, వాటిని తక్షణమే మరమ్మతులు చేయాలని కూడా ఆయన సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa