ఎన్నికల సమయం సమీపిస్తున్నకొద్దీ బిహార్లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్న వేళ.. అధిష్ఠానాల దృష్టిలో పడటానికి చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ సోదరి దివ్యా గౌతమ్కు (34) సీపీఐ (మార్క్సిస్ట్-లెనినిస్ట్) పార్టీ టికెట్ ఇచ్చింది. దిఘా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దివ్య పోటీ చేయనున్నారు. ఎమ్ఎస్ ధోని, కై పో చే, చిచ్చోరే వంటి సినిమాల ద్వారా సుశాంత్ సింగ్ రాజ్పుత్ సుపరిచితుడే. కానీ ఆయన సోదరి (కజిన్) దివ్య.. మరో దారి ఎంచుకున్నారు. ఇటు థియేటర్లలో కళాకారిణిగా షోలు చేస్తూనే.. సామాజిక కార్యకర్తగా చిన్నప్పటి నుంచే పోరాటాలు చేస్తున్నారు దివ్య. బిహార్ ఎన్నికల్లో పలువురు సెలెబ్రిటీలు కూడా పోటీ చేస్తున్న నేపథ్యంలో.. దివ్య సీపీఐ నుంచి బరిలోకి దిగుతున్నారు.
అన్న కోసం అదే నా నివాళి..!
సుశాంత్ సింగ్ రాజ్పుత్ అనుమానాస్పదంగా ముంబైలోని అపార్ట్మెంట్లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తన సోదరుడిని తాను ఒక ఆర్టిస్ట్గానే గుర్తుంచుకున్నానని దివ్య టైమ్స్ ఆఫ్ ఇండియాతో చెప్పారు. ఏది ఏమైనా ప్రతి ఏటా ఒకట్రెండు థియేటర్ షోలు (నాటకాలు) చేస్తానన్నారు. ఇది కళకు, తన సోదరుడు సుశాంత్ సింగ్కు తాను ఇచ్చే నివాళి అని దివ్య చెప్పారు. సుశాంత్ సింగ్ సొంతంగా కష్టపడి ఎదిగాడని.. ఆయన నుంచి ప్రేరణ పొంది తాను కూడా రాజకీయాల్లో ముందుకు వెళ్తానని దివ్య అన్నారు.
దివ్యా గౌతమ్ తండ్రి ఇంజినీర్. తల్లి గృహిణి. చిన్నప్పటి నుంచే ఆమెకు నాటకాలు అంటే మక్కువ ఎక్కువ. మాజిద్ మజిదీ, మేఘనాథ్, బిజూ టొప్పో వంటి దిగ్గజాలు రూపొందించిన సినిమాలు, డాక్యుమెంట్లపై ఇష్టం పెంచుకున్నారు. పట్నా కాలేజీలో చదువుతున్న క్రమంలో థియేటర్, కల్చరల్ బృందాల్లో చురుగ్గా ఉండేవారు. సాజాజిక బాధ్యత ఉన్న మహాబోజ్ (మన్ను బండారి నాటిక) వంటి నాటకాల్లో పాలుపంచుకున్నారు. అంతేకాకుండా ఫిల్మ్ స్క్రీనింగ్లు, డిబేట్లలోనూ పాల్గొనేవారు దివ్య.
దివ్య.. మాస్ కమ్యూనికేషన్ చదువుతున్న క్రమంలో కాలేజీలో సౌకర్యాల లేమి పట్ల.. విద్యార్థులను పోగేసి నిరసనలు చేసేవారు. 2012లో పట్నా యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ అధ్యక్ష పదవి కోసం AISA తరఫున పోటీ చేశారు. ఏబీవీపీ అభ్యర్థి చేతిలో త్రుటిలో ఓటమిపాలయ్యారు. అదే ఏడాది అధికారికంగా సీపీఐ (ఎమ్ఎల్) పార్టీలో చేరారు. ఇక 2012 ఢిల్లీ సామూహిక అత్యాచారం ఘటన తర్వాత కోసం వీధుల్లోకి నిరసనలు చేశారు. బేకౌఫ్ ఆజాదీ అంటూ నాటకాలు ప్రదర్శించారు.
అభాగ్యుల గొంతుకనౌతా..
థియేటర్ ఆర్టిస్టుగా, సామాజిక కార్యకర్తగా సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్నారు దివ్యా గౌతమ్. ఇప్పుడు తన అనుభవంతో రాజకీయంగానూ ప్రజల సమస్యల పట్ల పోరాడాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. "దశ మారిపోయింది.. కానీ సందేశం అలాగే ఉంది - అభాగ్యుల గొంతుకనౌతా" అంటూ దివ్యా గౌతమ్ చెప్పుకొచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa