ఇటీవల యూరియా వంటి ఎరువుల ఎగుమతులను చైనా తాత్కాలికంగా నిలిపివేయడంతో ప్రపంచ మార్కెట్లలో సరఫరా లోటు ఏర్పడింది. విదేశీ సరఫరాపై పూర్తి ఆధారపడటం ఎంత ప్రమాదకరమో ఈ అనుభవం భారత్కు ఒక ముఖ్యమైన పాఠం నేర్పింది. ఈ నేపత్యంలో రష్యాలో యూరియా ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటు ప్రణాళికను భారత్ తెరపైకి తెచ్చింది. ఆ దేశంలో సమృద్ధిగా లభించే సహజ వాయువు, అమ్మోనియా వనరులను వినియోగించుకుని, భవిష్యత్తులో ఎదురయ్యే సరఫరా లోటు, అధిక ధరల ముప్పు నుంచి తప్పించుకోవాలని భావిస్తోంది. ఇది భారత్ తన వ్యవసాయ ఉత్పత్తి స్థిరత్వాన్ని కాపాడటమే కాకుండా, ఆహార భద్రతను కూడా స్థిరీకరించే లక్ష్యాన్ని ఉద్దేశించింది.
ఇందులో భాగంగా భారతీయ ఎరువుల కంపెనీలు రష్యాలో ఉత్పత్తి తయారీ ప్లాంట్ను ఏర్పాటుకు సిద్ధమవుతున్నాయి. డిసెంబరులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన సందర్భంగా దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది కార్యరూపం దాల్చితే రష్యాలో భారత్ చేపట్టే మొట్టమొదటి ఎరువుల ప్రాజెక్ట్గా నిలుస్తుంది.
ఎకనామిక్స్ టైమ్స్ నివేదిక ప్రకారం. ఈ ప్రాజెక్ట్కు రష్యాలో సమృద్ధిగా లభించే అమోనియా, సహజ వాయు వనరులను వినియోగించనున్నారు. దీని ద్వారా భారత్కు స్థిరమైన ముడిసరుకు సరఫరా, అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్, గ్యాస్ ధరల అస్థిరతపై ఆధారపడే పరిస్థితి తగ్గుతుంది.
ప్రభుత్వరంగం సంస్థలైన రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్, నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్, ఇండియన్ పొటాష్ లిమిటెడ్ రష్యా భాగస్వాములతో కలిసి ఈ ప్రాజెక్టు ప్రణాళిక కోసం ఒప్పందంపై సంతకం చేశాయి. ఏడాదికి 20 లక్షల టన్నులకుపైగా యూరియా ఉత్పత్తి చేసే సామర్థ్యంతో నిర్మించే ఈ పరిశ్రమ కోసం భూ కేటాయింపు, గ్యాస్, అమ్మోనియా ధరలు, రవాణా అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయి.
ఈ ప్రాజెక్ట్ ఆలోచన ఖరీఫ్ సీజన్లో దేశంలోని రైతాంగం ఎదుర్కొన్న తీవ్రమైన ఎరువుల కొరత నేపథ్యంలో వచ్చింది. చైనా తాత్కాలికంగా యూరియా, ఎరువుల ఎగుమతులను నిలిపివేయడంతో సరఫరా గొలుసు దెబ్బతింది. దీంతో భారత్ ఇతర మార్కెట్ల నుంచి అధిక ధరలకు ఎరువులు దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది, ఇది ఆహార ఉత్పత్తిపై ఆందోళనలు రేకెత్తించింది.
అధిక వర్షాల కారణం ఎరువుల డిమాండ్ పెరిగింది. ఫలితంగా రైతులు మొక్కజొన్న వంటి అధిక పోషక పంటలను ఎక్కువగా సాగు చేస్తున్నారు. శీతాకాలంలో గోధుమల వంటి రబీ పంటలకు యూరియా అవసరం మరింత పెరుగుతుంది. రైతులకు ఎరువులు అందుబాటులోఉండేందుకు ప్రభుత్వం వాటిపై ధర నియంత్రణ, సబ్సిడీ విధానాలు అమలు చేస్తుంది. కానీ అంతర్జాతీయ ధరలు పెరిగినప్పుడల్లా ప్రభుత్వ సబ్సిడీ భారమూ పెరుగుతుంది.
బడ్జెట్లో ఎరువుల శాఖకు కేటాయింపులు ఏటా పెరుగుతున్నాయి. 2024-25లో రూ. 1.68 లక్షల కోట్లు కాగా.. 2025-26లో రూ. 1.92 లక్షల కోట్లకు పెంచారు. దేశీయ యూరియా ఉత్పత్తి 2023–24లో 31.4 మిలియన్ టన్నులతో రికార్డు సృష్టించింది. అయినా, ఇప్పటికీ ముడిసరుకు దిగుమతులపై భారత్ భారీగా ఆధారపడుతోంది. ప్రపంచం ఎరువుల వినియోగంలో రెండో స్థానం.. ఉత్పత్తిలో మూడో స్థానంలో భారత్ ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa