ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అఫ్గానిస్తాన్‌తో డైరెక్ట్ వార్.. పాక్ రక్షణ మంత్రి

international |  Suryaa Desk  | Published : Sun, Oct 26, 2025, 09:34 PM

పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ మధ్య ఇటీవల ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఖతార్ మధ్యవర్తిత్వంతో ఇరు దేశాలు కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయి. అయితే ఇరు దేశాల మధ్య శాశ్వత శాంతి నెలకొల్పే దిశగా శనివారం (అక్టోబర్ 25) ఇస్తాంబుల్‌లో చర్చలు ప్రారంభమయ్యాయి. ఆదివారం కూడా అవి కొనసాగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే పాక్‌ రక్షణశాఖ మంత్రి ఖవాజా మహమ్మద్‌ ఆసిఫ్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అఫ్గానిస్తాన్ శాంతిని కోరుకుంటుందనే విశ్వాసం తమకు ఉందని చెప్పారు. ఒకవేళ ఇస్తాంబుల్‌ వేదికగా జరుగుతున్న చర్చలు కొలిక్కి రాకపోతే బహిరంగ యుద్ధమేనని హెచ్చరించారు.


ఓ వైపు చర్చలు జరుగుతున్న వేళ ఖవాజా మహమ్మద్‌ ఆసిఫ్‌ ఈ తలబిరుసు వ్యాఖ్యలు చేశారు. 'మాకు ఒక ఛాన్స్ ఉంది. ఒకవేళ చర్చల్లో ఒక ఒప్పందం కుదరకపోతే.. అఫ్గానిస్తాన్‌తో బహిరంగ యుద్ధం చేస్తాం. కానీ, వాళ్లు శాంతిని కోరకుంటారని విశ్వసిస్తున్నా' అని పాక్‌ మంత్రి అన్నారు. అయితే ఇది అఫ్గానిస్తాన్‌ను బెదిరించే ప్రయత్నం అని నిపుణులు అంటున్నారు. కాగా, కాల్పుల విరమణకు ఇరుదేశాలు కట్టుబడి ఉన్నాయని.. గత నాలుగు రోజులుగా సరిహద్దులో ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని ఆసిఫ్ తెలిపారు.


అఫ్గానిస్తాన్ గడ్డపై నుంచి ఉగ్రమూకలు తమపై దాడి చేస్తున్నాయని.. వారిని ఆపాలని పాకిస్తాన్ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 11న ఇరు దేశాల సరిహద్దులో ఘర్షణ ప్రారంభమైంది. అనంతరం పాకిస్తాన్.. అఫ్గాన్‌పై వైమానిక దాడులు చేసింది. తెహ్రీక్ ఇ తాలిబాన్ పాకిస్తాన్ ఉగ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్లు పాకిస్తాన్ పేర్కొంది. దీన్ని ఖండించిన అఫ్గానిస్తాన్‌.. పాక్‌కు దీటుగా బదులిచ్చింది. డ్యూరాండ్ లైన్ వెంబడి ఉన్న పాకిస్తాన్ సైనిక పోస్టులపై భారీ కాల్పులు, ప్రతిదాడులు చేశాయి అఫ్గాన్ దళాలు. ఈ ప్రతిదాడుల్లో 58 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారని, 25 ఆర్మీ పోస్టులను తమ ఆధీనంలోకి తీసుకున్నామని అఫ్గాన్ తాలిబన్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ దీన్ని పాక్ ఖండించింది.


వాళ్లు చూస్తూ ఊరుకుంటారా..


అఫ్గానిస్తాన్ సార్వభౌమత్వాన్ని తక్కువ చేసి ఉల్లంఘనలకు పాల్పడితే.. బలమైన ప్రతిస్పందన ఉంటుందని తాలిబాన్లు గట్టిగా హెచ్చరించారు. అంతేకాకుండా పాక్‌కు నీళ్లు ఆపేసేలా కునార్ నదిపై అతిపెద్ద డ్యాం నిర్మించనున్నట్లు ప్రకటించారు. దీంతో పాక్‌పై మరింత ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే తాజాగా ఖాజా ఆసిఫ్ పేర్కొన్నట్లు యుద్ధమే జరిగితే.. తాబిబాన్లు గట్టిగానే ప్రతిస్పందించే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఆపరేషన్ సిందూర్ దెబ్బకు అల్లాడిపోయిన పాక్.. మరో యుద్ధం జరిగితే కోలుకోలేని దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa