ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా సవరణ.. కేంద్ర ఎన్నికల సంఘం

national |  Suryaa Desk  | Published : Mon, Oct 27, 2025, 06:56 PM

బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎస్ఐఆర్‌ నిర్వహించడంపై తీవ్ర దుమారం రేపుతున్న వేళ.. దేశవ్యాప్తంగా రెండో దశ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని 12 రాష్ట్రాల్లో ఈ ఎస్ఐఆర్ రెండో దశను నిర్వహించనున్నట్లు తెలిపింది. తాజాగా ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్.. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటర్ లిస్ట్‌ సెకండ్ ఫేజ్ ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన ప్రక్రియ రేపటి నుంచే మొదలు కానుందని వివరించారు.


రేపట్నుంచి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రారంభం అవుతుందని సీఈసీ జ్ఞానేష్ కుమార్ వెల్లడించారు. దేశంలోని 9 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ ఓటర్ల జాబితా సవరణ జరగనున్నట్లు తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, గోవా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్, కేరళ, రాజస్థాన్.. రాష్ట్రాలతోపాటు అండమాన్ అండ్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, పుదుచ్చేరి వంటి కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.


ఈ ప్రక్రియలో భాగంగా బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓలు) ప్రతి ఓటరు ఇంటిని కనీసం 3 సార్లు సందర్శించి కొత్త ఓటర్లను జాబితాలో చేర్చడానికి.. ఏవైనా తప్పులను సరిదిద్దుతారని సీఈసీ జ్ఞానేష్ కుమార్ పేర్కొన్నారు. బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి ఫారం-6, డిక్లరేషన్ ఫారాలను సేకరించి, కొత్త ఓటర్లు ఫారాలను నింపడానికి, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్ఓ) లేదా అసిస్టెంట్ ఈఆర్ఓకి అందజేస్తారని తెలిపారు.


ఎస్ఐఆర్ రెండో దశ శిక్షణ కార్యక్రమాలు మంగళవారం నుంచి ప్రారంభం అవుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ తెలిపారు. అన్ని ప్రధాన ఎన్నికల అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులు రానున్న రెండు రోజుల్లో రాజకీయ పార్టీలతో సమావేశమై ఎస్ఐఆర్ ప్రక్రియపై వారికి వివరించాలని సీఈసీ ఆదేశాలు జారీ చేశారు. ఏ పోలింగ్ స్టేషన్‌లోనూ 1200 కంటే ఎక్కువ ఓటర్లు ఉండరని జ్ఞానేష్ కుమార్ స్పష్టం చేశారు.


ఇక ఈ సర్వేలో చనిపోయిన వారు, బదిలీ చేయబడిన వారి ఓటర్లను తొలగిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది. అర్హులైన ప్రతీ ఒక్కరికి ఓటు హక్కు కల్పించడమే ఎస్ఐఆర్ కార్యక్రమం లక్ష్యమని వెల్లడించింది. దేశవ్యాప్తంగా ప్రతీ ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితాలో సవరణలు తప్పనిసరని పేర్కొంది. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఈ అర్ధరాత్రి నుంచే ఓటర్ల జాబితాను సీజ్ చేస్తామని ప్రకటించింది.


ఇప్పటివరకు దేశంలో 1951 నుంచి 2004 మధ్య 8 స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేశారని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్.. వెల్లడించారు. రాజకీయ పార్టీలు అనేక సందర్భాల్లో ఓటర్ల జాబితాల నాణ్యత సమస్యను లేవనెత్తాయని తెలిపారు. కాగా.. బిహార్‌లో ఓటర్ల జాబితాకు సంబంధించిన ఎస్ఐఆర్ ప్రక్రియ ఇప్పటికే పూర్తైన సంగతి తెలిసిందే. దాదాపు 7.5 కోట్ల పేర్లతో కూడిన తుది జాబితా సెప్టెంబర్ 30వ తేదీన ప్రచురించారు. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 6, 11వ తేదీ తేదీల్లో రెండు దశల్లో జరుగనుంది. ఫలితాలు నవంబర్ 14న ప్రకటించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa