మొంథా తుపాను కాకినాడ సమీపంలో తీరం దాటనుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం పూర్తి సన్నద్ధతతో ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ప్రాణ నష్టాన్ని నివారించడమే ప్రథమ కర్తవ్యంగా భావించి, ముందస్తు రక్షణ చర్యలను పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. మొంథా తుపాను ప్రభావం, సహాయక చర్యలపై కాకినాడ జిల్లా ఇంఛార్జి మంత్రి నారాయణ, స్పెషల్ ఆఫీసర్ కృష్ణతేజ, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, ఎస్పీ బిందు మాధవ్, ఇతర ఉన్నతాధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, "మొంథా తుపాను ప్రభావం కాకినాడ జిల్లాలోని 12 మండలాలపై అధికంగా ఉంటుందని సమాచారం. రేపు కాకినాడ పరిసర ప్రాంతాల్లో తీరం దాటే సమయంలో బలమైన ఈదురుగాలులు, అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉంది. యంత్రాంగం 24 గంటలూ అందుబాటులో ఉంటూ పరిస్థితిని సమీక్షించాలి. తీర ప్రాంత ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. ఇప్పటికే జిల్లాలో 260 పునరావాస కేంద్రాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఆయా కేంద్రాల్లో ఆహారం, పరిశుభ్రమైన తాగునీరు, పాలు, అత్యవసర ఔషధాలు సిద్ధంగా ఉంచాలి" అని దిశానిర్దేశం చేశారు.ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని గుర్తించి వారికి ప్రాధాన్యత ఇవ్వాలని పవన్ కళ్యాణ్ సూచించారు. "పిఠాపురం నియోజకవర్గంతో పాటు జిల్లావ్యాప్తంగా ఉన్న గర్భిణులను సురక్షిత ప్రదేశాలకు తరలించాలి. ఇప్పటికే 142 మంది గర్భిణులను పునరావాస కేంద్రాలకు చేర్చినట్లు కలెక్టర్ తెలిపారు. వారికి అవసరమైన పౌష్టికాహారం, వైద్య సేవలు నిరంతరం అందేలా చూడాలి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసిన విషయాన్ని ప్రజలకు తెలియజేయాలి. తుపానుపై భయాందోళనలు సృష్టించకుండా, గ్రామాల్లో మైకుల ద్వారా సహాయక చర్యలను వివరిస్తూ ప్రజలకు ధైర్యం చెప్పాలి" అని ఆయన అన్నారు.తుపాను సహాయక చర్యల్లో అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో ముందుకు సాగాలని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. పునరావాస కేంద్రాలకు తరలివెళ్లిన ప్రజల ఇళ్లకు దొంగల బెడద లేకుండా పోలీసులు ప్రత్యేక భద్రత కల్పించాలని, అవసరమైతే సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఏలేరు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నందున, ఆయకట్టు ప్రజలను జలవనరుల శాఖ అధికారులు ముందుగానే అప్రమత్తం చేయాలన్నారు. బలహీనంగా ఉన్న చెరువు కట్టలు, కాలువ గట్లను గుర్తించి ఇసుక బస్తాలతో పటిష్ఠం చేయాలని సూచించారు. మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లకుండా కట్టడి చేయాలని, వారి బోట్లకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని మత్స్యశాఖ అధికారులకు తెలిపారు. తుపాను కారణంగా నిత్యావసర వస్తువుల సరఫరాకు ఆటంకం కలగకుండా మార్కెటింగ్ శాఖ చూడాలన్నారు. విద్యుత్ స్తంభాలు, కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉన్నందున, మరమ్మతుల కోసం సిబ్బందిని సిద్ధం చేయాలని, అత్యవసర సమాచారం కోసం శాటిలైట్ ఫోన్లను వినియోగించాలని సూచించారు.తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయక చర్యల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం రూ. 19 కోట్లు విడుదల చేయగా, అందులో కాకినాడ జిల్లాకు ప్రత్యేకంగా రూ. కోటి కేటాయించినట్లు ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ నిధులను పునరావాస కేంద్రాల్లో సౌకర్యాల కల్పన, బాధితులకు నిత్యావసరాల పంపిణీ, దెబ్బతిన్న ఇళ్లకు తక్షణ సాయం అందించడం వంటి కార్యక్రమాలకు వినియోగించాలని అధికారులకు స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa