ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లోన్ యాప్‌నే దెబ్బకొట్టిన సైబర్ నేరగాళ్లు,,,3 గంటల్లో రూ.49 కోట్లు

national |  Suryaa Desk  | Published : Mon, Oct 27, 2025, 09:00 PM

రోజురోజుకూ సైబర్ నేరగాళ్ల ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. సామాన్యులు, పేదల కష్టార్జితాన్ని క్షణాల్లో కొట్టేస్తున్నారు. ఏళ్లకేళ్లు సంపాదించి పెట్టుకున్న డబ్బును.. ఒక్కసారి మాయం చేస్తున్నారు. వ్యాపారస్తులు, చదువుకున్నవాళ్లు, రాజకీయ నాయకులు సహా ఏ ఒక్కరినీ వదలకుండా కేటుగాళ్లు.. సైబర్ దాడులు చేసి దోచుకుంటున్నారు. తాజాగా ఏకంగా ఓ లోన్ యాప్‌ లక్ష్యంగా జరిపిన సైబర్ దాడిలో భారీగా సొమ్మును కాజేశారు. 3 గంటల్లోనే ఏకంగా రూ.49 కోట్లను కొల్లగొట్టారు. అనంతం వాటిని.. వందలాది ఫేక్ అకౌంట్లలోకి ట్రాన్స్‌ఫర్ చేశారు. రంగంలోకి దిగిన సైబర్ పోలీసులు.. ఇద్దర్ని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.10 కోట్లను ఫ్రీజ్ చేశారు. విదేశాల్లో ఉన్న నిందితుల కోసం ఇంటర్నేషనల్ ఏజెన్సీల సాయంతో గాలింపు చేపట్టారు.


ఇటీవలి కాలంలో భారత్‌లో జరిగిన అతిపెద్ద సైబర్ దాడుల్లో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. కేవలం 3 గంటల వ్యవధిలోనే ఒక లోన్ యాప్ నుంచి ఏకంగా రూ. 49 కోట్లను సైబర్ నేరగాళ్లు కొట్టేశారు. బెంగళూరులోని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ భారీ సైబర్ దోపిడీ కేసును దర్యాప్తు చేస్తున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరుకు చెందిన మనీవ్యూ అనే లోన్ యాప్‌ ఏపీఐ సిస్టమ్‌ను లక్ష్యంగా చేసుకున్న దుబాయ్‌లోని ఇంటర్నేషనల్ సైబర్ ముఠా కేవలం 3 గంటల్లోనే రూ. 49 కోట్లను కొల్లగొట్టింది. సైబర్ హ్యాకర్లు యాప్‌ ఏపీఐ కీని ఉపయోగించి ఆ మొత్తాన్ని 653 నకిలీ ఖాతాల్లోకి ట్రాన్స్‌ఫర్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. బెంగళూరులోని సీసీబీ పోలీసులు దర్యాప్తు చేసి.. బెళగావికి చెందిన ఒక వ్యక్తితో సహా మొత్తం ఇద్దర్ని అరెస్ట్ చేశారు.


విజ్డమ్ ఫైనాన్స్ కంపెనీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ మనీవ్యూ యాప్‌పై ఈ సైబర్ దాడి జరిగింది. బ్యాంకులు, సర్వర్‌లతో కమ్యూనికేట్ చేయడానికి యాప్‌లు ఉపయోగించే డిజిటల్ ఇంటర్‌ఫేస్ అయిన ఏపీఐ సిస్టమ్‌లోకి చొరబడిన హ్యాకర్లు.. దాని కీని ఉపయోగించి మొత్తం ట్రాన్సాక్షన్లను తమ కంట్రోల్‌లోకి తీసుకున్నారు. ఈ సైబర్ దాడిని దుబాయ్‌, చైనా, హాంకాంగ్‌, ఫిలిప్పిన్స్‌ వంటి వేర్వేరు దేశాల నుంచి పనిచేసే అంతర్జాతీయ ముఠా ప్లాన్ చేసిందని పోలీసులు వెల్లడించారు.


ఈ మొత్తం ఆపరేషన్‌కు దుబాయ్‌లో ఉన్న భారత సంతతికి చెందిన ఒక వ్యక్తి సూత్రధారిగా వ్యవహరించినట్లు బెంగళూరు సీసీబీ పోలీసులు గుర్తించారు. అతడు బెళగావికి చెందిన ఇస్మాయిల్ అత్తర్ నుంచి వర్చువల్ ప్రైవేట్ సర్వర్‌లను కొనుగోలు చేశాడని పేర్కొన్నారు. ఒక్కో సర్వర్‌ను రూ. 2 వేలు అద్దెకు తీసుకుని.. ఫ్రాన్స్‌కు చెందిన ఐపీ అడ్రస్‌లకు లింక్ చేసి ఈ సైబర్ దాడిని పక్కా ప్లాన్ ప్రకారం చేశారని వెల్లడించారు.


ఈ కేసు దర్యాప్తులో భాగంగా బెంగళూరులోని సీసీబీ సైబర్ క్రైమ్ పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీపీఎస్‌లను కొనుగోలు చేసిన వ్యక్తి ఇస్మాయిల్ అత్తర్‌తోపాటు.. మహారాష్ట్రకు చెందిన పటేల్.. అనే వ్యక్తి పేరు మీద ఉన్న నకిలీ ఖాతాకు డబ్బు ట్రాన్స్‌ఫర్ కావడంతో అతడ్ని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే సైబర్ పోలీసులు.. పలు బ్యాంకు అకౌంట్లలో ఉన్న రూ. 10 కోట్లను ఫ్రీజ్‌ చేయగలిగారు. నిందితుల నుంచి ల్యాప్‌టాప్‌లు, పెన్‌డ్రైవ్‌లను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఇద్దరు నిందితులను జ్యుడీషియల్ కస్టడీలో ఉంచారు.


డిజిటల్ ఫుట్‌ప్రింట్‌లను దాచడానికి హ్యాకర్లు నిజమైన అకౌంట్లతోపాటు ఫేక్ అకౌంట్లను ఉపయోగించినట్లు పోలీసులు వెల్లడించారు. అలాగే డబ్బును విత్ డ్రా చేసుకోవడానికి.. చిన్న కమీషన్లు చెల్లించి వ్యక్తులను వాడుకున్నారని గుర్తించారు. ప్రస్తుతం దుబాయ్‌లో ముగ్గురు, హాంకాంగ్‌లో ఇద్దరు అనుమానితులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ ముఠాలోని ప్రధాన నిందితులను పట్టుకునేందుకు అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు సీసీబీ పోలీసులు తెలిపారు. ఈ భారీ సైబర్ దాడి దేశంలోని డిజిటల్ ఫైనాన్స్ ప్లాట్‌ఫామ్‌ల ఏపీఐ భద్రత ఎంత ముఖ్యమో మరోసారి గుర్తు చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa