విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో.. భారత్కు చెందిన ఒక విద్యార్థి తోటి ప్రయాణికులపై దారుణంగా దాడి చేయడంతో పెను సంచలనం రేగింది. ఈ ఉద్రిక్త పరిస్థితుల కారణంగా విమానాన్ని అత్యవసరంగా దారి మళ్లించి ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. అధికారులు వెంటనే ఆ భారతీయ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఆంధ్ర ప్రదేశ్కు చెందిన 28 ఏళ్ల ఉసిరిపల్లి ప్రణీత్ కుమార్.. ఇటీవల లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ విమానంలో ప్రయాణించాడు. ఈ విమానం అమెరికాలోని చికాగో నుంచి జర్మనీకి బయలుదేరింది. ప్రయాణం మధ్యలో.. ప్రణీత్ కుమార్ అకస్మాత్తుగా రెచ్చిపోయి, తోటి ప్రయాణికులపై ఫోర్క్తో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో 17 ఏళ్ల వయస్సు గల ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఒకరికి భుజంపై, మరొకరికి తల వెనుక భాగంలో గాయాలు అయినట్లు సమాచారం. అయితే ప్రణీత్ కుమార్ దాడిని అడ్డుకోవడానికి విమాన సిబ్బంది ప్రయత్నించగా.. అతను వారిని కూడా భయభ్రాంతులకు గురిచేశాడు. తన చేతి వేళ్లను తుపాకీగా చూపిస్తూ.. సిబ్బందిపై దాడికి పాల్పడేందుకు ప్రయత్నించాడు. అంతేకాకుండా విమానంలో ప్రయాణిస్తున్న మరో మహిళపై కూడా చేయి చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు.
విమానంలో ప్రణీత్ కుమార్ సృష్టించిన బీభత్సం కారణంగా.. ప్రయాణికులు భయంతో వణికిపోయారు. పరిస్థితి అదుపు తప్పడంతో.. విమానాన్ని తక్షణమే దారి మళ్లించి, బోస్టన్ లోగాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. విమానం ల్యాండ్ అయిన వెంటనే.., అధికారులు ప్రణీత్ కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనను యూఎస్ అటార్నీ జనరల్ కార్యాలయం కూడా ధృవీకరించింది. అధికారుల దర్యాప్తులో తేలిన వివరాల ప్రకారం.. ప్రణీత్ కుమార్ విద్యార్థి వీసాపై అమెరికా వచ్చాడు. మాస్టర్స్ డిగ్రీ చదవడానికి వచ్చిన ఇతను.. ప్రస్తుతం అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
విమానంలో దాడికి పాల్పడటం అనేది తీవ్రమైన నేరం. ఈ నేరం రుజువు అయితే ప్రణీత్ కుమార్కు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని.. అంతేకాకుండా రెండు కోట్ల రూపాయలకు పైగా జరిమానా విధించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa