ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.50 లంచం కేసులో ఉద్యోగం పోయింది.. 29 ఏళ్ల తర్వాత సుప్రీంలో నిర్దోషిగా టీటీఈ

national |  Suryaa Desk  | Published : Wed, Oct 29, 2025, 09:07 PM

దాదాపు 3 దశాబ్దాలుగా భారతీయ రైల్వేలో తీవ్ర కలకలం సృష్టించిన ఓ లంచం కేసు సుప్రీంకోర్టు తీర్పుతో ముగిసింది. రూ. 50 లంచం తీసుకున్నారనే ఆరోపణలపై 1996లో ఉద్యోగం నుంచి తొలగించబడిన ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ) వి.ఎం. సౌదాగర్‌ను సుప్రీంకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అయితే దురదృష్టవశాత్తూ ఈ కోర్టు తీర్పు రాకముందే.. హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న సమయంలోనే టీటీఈ సౌదాగర్ మరణించగా.. ఆయన వారసులు మాత్రం తమ పోరాటాన్ని కొనసాగించారు. ఈ నేపథ్యంలోనే తాజాగు జస్టిస్ సంజయ్ కరోల్,జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం తమ 10 పేజీల తీర్పులో సౌదాగర్ మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసింది.


రికార్డులో ఉన్న ఆధారాల ఆధారంగా.. హైకోర్టు తీర్పును అప్పీలు చేసుకున్న సౌదాగర్‌పై ఉన్న ఆరోపణలన్నీ నిరూపించలేదని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. సర్వీస్ నుంచి తొలగించిన పెనాల్టీని రద్దు చేస్తూ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్) జోక్యం చేసుకోవడం సరైన నిర్ణయమేనని తేల్చి చెప్పింది. ఈ కేసును విచారణ చేసిన అధికారి రిపోర్టును పక్కదారి పట్టించే ఆధారాలను సేకరించారని.. క్యాట్ పెనాల్టీ ఆర్డర్‌ను రద్దు చేయడంలో పూర్తిగా సమర్థించిందని కోర్టు పేర్కొంది. ఈ తీర్పు సందర్బంగా.. కేసు విచారణ అధికారి ఇచ్చిన నివేదికలో లోపాలు ఉన్నాయని గుర్తించిన సుప్రీంకోర్టు.. క్యాట్ ఉత్తర్వును నిలిపివేయడంలో హైకోర్టు విఫలమైందని అభిప్రాయం వ్యక్తం చేసింది.


1988 మే నెలలో దాదర్–నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ సెకండ్ క్లాస్ స్లీపర్ కోచ్‌లో సౌదాగర్ టీటీఈగా విధులు నిర్వర్తిస్తుండగా.. ఈ వివాదం చోటు చేసుకుంది. అప్పుడు విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అయితే ప్రయాణికులకు బెర్త్ కేటాయించడం ముగ్గురి నుంచి సౌదాగర్.. రూ. 25, రూ. 20, రూ. 5 చొప్పున మొత్తం రూ. 50 లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.


వీటితోపాటు సౌదాగర్ వద్ద వ్యక్తిగత, రైల్వే నిధులు మినహా రూ. 1,254 అధిక నగదు కలిగి ఉండటం.. ఒక ప్రయాణికుడి నుంచి రూ. 18 ఛార్జీల వ్యత్యాసాన్ని వసూలు చేయడంలో విఫలం కావడం, డ్యూటీ కార్డ్ పాస్ చెల్లుబాటును అక్రమంగా పొడిగించడం వంటి అదనపు ఆరోపణలు కూడా వచ్చాయి. ఇక రైల్వే శాఖ నిర్వహించిన అంతర్గత విచారణ తర్వాత.. సమగ్రత లోపం, విధి పట్ల అంకితభావం లేకపోవడం వంటి కారణాలపై 1996లో రైల్వే నిబంధనల ప్రకారం సౌదాగర్‌ను టీటీఈ ఉద్యోగం నుంచి తొలగించారు.


తొలుత ఈ తొలగింపును సౌదాగర్ క్యాట్‌లో సవాల్ చేయగా.. కోర్టు అతడిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని 2002లో ఆదేశించింది. అయితే.. రైల్వే శాఖ బాంబే హైకోర్టులో అప్పీల్ చేసింది. కేసు అక్కడ పెండింగ్‌లో ఉండగానే సౌదాగర్ ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత సౌదాగర్‌ను ఉద్యోగం నుంచి తొలగించడాన్ని 2017లో బాంబే హైకోర్టు సమర్థించింది. అయినప్పటికీ వెనక్కి తగ్గని ఆయన కుటుంబం పట్టుదలతో సుప్రీంకోర్టుకు వెళ్లి.. అప్పీలు చేయగా.. ఇప్పుడు నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa