ట్రెండింగ్
Epaper    English    தமிழ்

10 మంది ముస్లిం అమ్మాయిలను పెళ్లి చేసుకోండి, ఉద్యోగం ఇప్పిస్తా..,బీజేపీ నేత వివాదాస్పద ఆఫర్

national |  Suryaa Desk  | Published : Wed, Oct 29, 2025, 09:02 PM

ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ మాజీ ఎమ్మెల్యే రాఘవేంద్ర ప్రతాప్ సింగ్ చేసిన ప్రకటన ఇప్పుడు ఆ రాష్ట్రంలో తీవ్ర దుమారానికి కారణం అయింది. ముస్లిం యువకులతో వివాహం పేరుతో ఇద్దరు హిందూ మహిళలకు బలవంతంగా మతం మార్పించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే సిద్ధార్థ్‌నగర్ జిల్లా దుమారియాగంజ్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అయిన రాఘవేంద్ర ప్రతాప్ సింగ్.. ధంఖర్‌పూర్ గ్రామంలో పర్యటించారు. ఆ గ్రామంలో ఇద్దరు హిందూ మహిళలను ముస్లిం యువకులు మభ్యపెట్టి బలవంతంగా మతం మార్పించి పెళ్లి చేసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.


అక్టోబర్ 16వ తేదీన జరిగిన ఈ పర్యటనకు సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇద్దరు హిందూ మహిళలను బలవంతంగా మత మార్పిడి చేసినందుకు బదులుగా.. 10 మంది ముస్లిం మహిళలను హిందూ యువకులు పెళ్లి చేసుకోవాలని సూచించారు. ఏ హిందూ యువకుడైనా ముస్లిం అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే.. తానే ఆ వివాహాన్ని దగ్గరుండి జరిపిస్తానని పేర్కొన్నారు. అంతేకాకుండా.. వారికి ఉద్యోగం కూడా ఇప్పిస్తానని రాఘవేంద్ర ప్రతాప్ సింగ్ చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.


హిందువులు భయపడాల్సిన అవసరం లేదని.. యూపీలో తమకు నచ్చింది ఏమైనా చేసుకోవచ్చని ధైర్యం చెప్పారు. ఇది అఖిలేష్ యాదవ్ సమయం కాదని.. భయపడాల్సిన అవసరం లేదని.. తమ ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఇద్దరు హిందూ అమ్మాయిలను తీసుకువెళ్లినందుకు బదులు.. హిందూ యువత కనీసం 10 మంది ముస్లిం యువతులను తీసుకువచ్చి పెళ్లి చేసుకోవాలని.. మిగిలిన బాధ్యతలు అన్నీ తాను చూసుకుంటానని వెల్లడించారు.


దుమారియాగంజ్ ప్రాంతాన్ని గతంలో మినీ పాకిస్తాన్ అని పిలిచేవారని పేర్కొన్న రాఘవేంద్ర ప్రతాప్ సింగ్.. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ప్రజల్లో ఈ భయాందోళనలు తొలగిపోయాయని తెలిపారు. లేదంటే అనేక గ్రామాల్లో హిందువులు భయంతో జీవించేవారని.. వారి ఆడపిల్లలు సురక్షితంగా ఉండేవారు కాదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.


ఇది అఖిలేష్ యాదవ్ లేదా మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలు చేసే ఇతర పార్టీల శకం కాదని.. ఇది యోగి శకమని తేల్చి చెప్పారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని.. నచ్చింది చేయండని.. తాము అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఇక రాఘవేంద్ర ప్రతాప్ సింగ్ చేసిన వ్యాఖ్యలను సమాజ్‌వాదీ పార్టీకి చెందిన దుమారియాగంజ్ ఎమ్మెల్యే సయ్యదా ఖతూన్ తీవ్రంగా ఖండించారు. మతపరమైన అల్లర్లను సృష్టించే వ్యూహంలో భాగంగానే ఆయన ఈ ప్రకటనలు చేశారని ఆమె తీవ్ర ఆరోపణలు గుప్పించారు.


రాఘవేంద్ర ప్రతాప్ సింగ్ చేసిన వ్యాఖ్యలు మహిళలను అవమానించేలా ఉన్నాయని.. వారు ముస్లింలను నిరంతరం అవమానిస్తున్నారని, అగౌరవపరుస్తున్నారని మండిపడ్డారు. ముస్లింలు భారతదేశ పౌరులు కాదా.. ఈ దేశ స్వాతంత్య్రం కోసం వారు ప్రాణ త్యాగాలు చేయలేదా అని ప్రశ్నించారు. తాము చేసిన ఫిర్యాదులపై ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోలేదని.. చూస్తూ ఉండిపోతోందని.. ఏదైనా జరిగితే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని సయ్యదా ఖతూన్ హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa