హోటళ్లు, రెస్టారెంట్లు వంటి వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు చమురు మార్కెటింగ్ కంపెనీలు స్వల్ప ఊరట కల్పించాయి. 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను 5 రూపాయల మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. సవరించిన ఈ కొత్త ధరలు నవంబర్ 1వ తేదీ నుంచే దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి.ప్రతి నెల మొదటి తేదీన చమురు సంస్థలు గ్యాస్ సిలిండర్ల ధరలను సమీక్షిస్తుంటాయి. ఈ ప్రక్రియలో భాగంగా ఈరోజు వాణిజ్య సిలిండర్ ధరను తగ్గించాయి. తాజా తగ్గింపుతో దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల సిలిండర్ ధర రూ.1,595.50 నుంచి రూ.1,590.50కి చేరింది. ఇతర ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే కోల్కతాలో రూ.1,694, ముంబైలో రూ.1,542, చెన్నైలో రూ.1,750గా ఉంది. ఇక మన హైదరాబాద్లో కమర్షియల్ సిలిండర్ కొత్త ధర రూ.1,812.50గా నమోదైంది.అయితే, ఈ తగ్గింపు కేవలం వాణిజ్య సిలిండర్లకు మాత్రమే పరిమితమైంది. ఇళ్లలో వంట కోసం ఉపయోగించే 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.850 నుంచి రూ.960 మధ్య స్థిరంగా కొనసాగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa