ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దక్షిణాదిన హిందీ వివాదం వేళ.. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు

national |  Suryaa Desk  | Published : Sat, Nov 01, 2025, 09:27 PM

కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏకు.. దక్షిణాది రాష్ట్రాలకు మధ్య హిందీ భాష విషయంలో మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో.. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కర్ణాటక రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం (రాజ్యోత్సవ దినం) సందర్భంగా బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన సిద్ధరామయ్య.. కేంద్రం కర్ణాటక పట్ల సవతి తల్లి ప్రేమను ఒలకబోస్తోందని ఆరోపించారు. అంతేకాకుండా.. కర్ణాటకపై బలవంతంగా హిందీని రుద్దుతోందని మండిపడ్డారు. అదే సమయంలో కర్ణాటకపై కేంద్ర ప్రభుత్వం ఆర్థిక, భాషాపరమైన వివక్షను ప్రదర్శిస్తోందని సిద్ధరామయ్య సంచలన ఆరోపణలు చేశారు.


కేంద్ర ప్రభుత్వ ఖజానాకు తమ కర్ణాటక రాష్ట్రం రూ. 4.5 లక్షల కోట్ల ఆదాయాన్ని సమకూర్చుతోందని పేర్కొన్న సిద్ధరామయ్య.. అయినప్పటికీ తమకు రావాల్సిన న్యాయమైన వాటాను కేంద్రం ఇచ్చేందుకు నిరాకరిస్తోందని ఆరోపించారు. తమకు కేవలం స్వల్ప మొత్తంలోనే నిధులు తిరిగి ఇస్తోందని తీవ్రంగా విమర్శించారు.


హిందీ, సంస్కృత భాషల అభివృద్ధికి కేంద్రం గ్రాంట్లు మంజూరు చేస్తోందని పేర్కొన్నారు. కానీ దేశంలోని ఇతర భాషల విషయంలో.. ముఖ్యంగా క్లాసికల్ హోదా ఉన్న కన్నడ భాష విషయంలో అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. కన్నడ అభివృద్ధికి తగిన నిధులు నిరాకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కన్నడను వ్యతిరేకించే వారందరినీ రాష్ట్ర ప్రజలు తప్పనిసరిగా వ్యతిరేకించాలని ఈ సందర్భంగా సిద్ధరామయ్య పిలుపునిచ్చారు.


విద్యారంగంలో జరుగుతున్న నిర్లక్ష్యం పిల్లల ప్రతిభను దెబ్బతీస్తోందని సిద్ధరామయ్య ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందిన దేశాల్లో పిల్లలు తమ మాతృభాషలోనే ఆలోచిస్తారని.. నేర్చుకుంటారని.. కలలు కంటారని పేర్కొన్నారు. కానీ మన దేశంలో మాత్రం పరిస్థితి దానికి విరుద్ధంగా ఉంటుందని.. ఇంగ్లీష్, హిందీ భాషలు మన పిల్లల సహజసిద్ధమైన ప్రతిభను బలహీనపరుస్తున్నాయని కర్ణాటక ముఖ్యమంత్రి తెలిపారు. ఈ సమస్యను అధిగమించడానికి.. మాతృభాషను బోధనా మాధ్యమంగా ప్రవేశపెట్టేలా కేంద్రం తక్షణమే ఒక చట్టాన్ని తీసుకురావాలని సిద్ధరామయ్య డిమాండ్ చేశారు. కన్నడ భాష, సంస్కృతిని కొత్త శిఖరాలకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa