ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ రైతులకు.. 48 గంటల్లోపు డబ్బులు జమ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 02, 2025, 08:38 PM

ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు ముఖ్య గమనిక. రేపటి నుంచి (నవంబర్ 3) ఏపీలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభం కానుంది. సోమవారం రోజు నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభిస్తున్నట్లు ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు రైతులు ధాన్యం వివరాల నమోదు కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక వాట్సాప్ నంబర్ అందుబాటులోకి తెచ్చింది. 7337359375 నంబరును ఉపయోగించుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ రైతులకు వివరించారు. ధాన్యం విక్రయాలు జరపాలనుకునే రైతులు ఈ వాట్సాప్ నంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.


మరోవైపు ఈ ఖరీఫ్‌ సీజన్‌లో 51 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ధాన్యం కొనుగోలు కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3,013 రైతు సేవా కేంద్రాలు ఉపయోగించుకోనున్నారు. అలాగే 2,061 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన ఒకట్రెండు రోజుల్లో వారి అకౌంట్లలో డబ్బులు జమ చేయనున్నారు. ఈ విషయాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ధాన్యం కొనుగోలు తర్వాత 24 నుంచి 48 గంటల్లోపే... రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి ధాన్యం సొమ్ము జమచేస్తామని ప్రకటించారు. మరోవైపు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా రేపు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. తాడేపల్లిగూడెం ఆరుగొలనులో మంత్రి నాదెండ్ల ధాన్యం కొనుగోళ్లను అధికారికంగా ప్రారంభిస్తారు.


మరోవైపు 7337359375 వాట్సాప్ నంబర్‌కు హాయ్ అని మెసేజ్ చేయడం ద్వారా రైతులు తమ ధాన్యం అమ్మకాల ప్రక్రియను చేపట్టవచ్చు. ఈ నంబర్ ఉపయోగించి ఎప్పుడు, ఎక్కడ, ఎంత మేరకు ధాన్యం విక్రయించనున్నామనే వివరాలను ఎంపిక చేసుకుని.. స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఆ సమయానికి అక్కడకు చేరుకుని రైతులు తమ ధాన్యం అమ్ముకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.అలాగే తమ ధాన్యాన్ని నచ్చిన కేంద్రంలో విక్రయించుకునే వీలుంది. అలాగే ధాన్యం వాహనంలో ఎగుమతి చేసినప్పటి నుంచి రైసుమిల్లు వద్ద దించే వరకూ జీపీఎస్‌లో ట్రాక్‌ చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇక ధాన్యం కొనుగోళ్ల కోసం 10 వేల 700 మంది సిబ్బందిని ఉపయోగించనున్నారు.


మరోవైపు గతంలో తలెత్తిన ఇబ్బందులు మరోసారి రాకూడదనే ఉద్దేశంతో రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించేందుకు ఈసారి క్విక్‌ రెస్పాన్స్‌ టీమ్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఈ టీమ్‌లో తహసీల్దారు, ఎంఏవో , టెక్నికల్‌ అసిస్టెంట్‌ సభ్యులుగా ఉంటారు. ధాన్యానికి సంబంధించిన తేమ, నాణ్యత విషయంలోనూ ఈ క్విక్ రెస్పాన్స్ టీమ్.. ఎలాంటి సమస్య ఉన్నా వెంటనే పరిష్కరిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa