ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ యువతకు మంచి ఛాన్స్.. రూ. లక్షల్లో జీతం.. ప్రభుత్వం కొత్త ప్రాజెక్టు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 02, 2025, 08:39 PM

రాష్ట్రంలోని యువతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో తీపికబురు వినిపించింది. ఆంధ్రప్రదేశ్ యువత విదేశాల్లోనూ ఉద్యోగాలు సంపాదించుకునేలా, విదేశాల్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేలా ఏపీ ప్రభుత్వం వసుధ ప్రాజెక్టును తీసుకువచ్చింది. ఈ వసుధ ప్రాజెక్టు కింద రాష్ట్రంలోని విద్యార్థులకు విదేశీ భాషలను నేర్పించి. నైపుణ్యాన్ని మెరుగుపరిచి.. ఇతర దేశాల్లోని ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకునేలా వారిని తీర్చిదిద్దనున్నారు. అయితే ఈ వసుధ ప్రాజెక్టును మరింత విస్తరించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.


ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ సూచనల ప్రకారం.. వసుధ ప్రాజెక్టును మరింత విస్తరించనున్నారు. ఇందులో భాగంగా గవర్నమెంట్ కాలేజీలలో పనిచేసే భాష పండితులకు విదేశీ భాషలు నేర్పించనున్నారు. తొలుత 60 మంది భాషా పండితులకు జర్మన్, కొరియన్ , జపనీస్, ఇటాలియన్ భాషలు నేర్పించనున్నారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో వీరికి ట్రైనింగ్ ఇస్తారు.


అయితే వచ్చే ఏడాది నుంచి భాషా పండితులకు ఈ శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఏడాది పాటు ట్రైనింగ్ ఇచ్చిన అనంతరం.. ఆయా భాషా పండితులు.. తమ తమ కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఈ జర్మన్, జపనీస్, ఇటాలియన్, కొరియన్ భాషలు నేర్పించాల్సి ఉంటుంది. దీంతో గవర్నమెంట్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు విదేశీ భాషలు నేర్చుకునే వెసలుబాటు కలుగుతుందని.. ఫలితంగా ఆయా దేశాల్లో ఉద్యోగాలు సంపాదించుకునేందుకు అవకాశం ఉంటుందనేది ప్రభుత్వం ఉద్దేశం.


మరోవైపు రాష్ట్రంలోని గిరిజన, సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు కూడా జర్మన్ భాష నేర్పిస్తున్నారు. సుమారు 150 మంది విద్యార్థులకు ఇందులో ట్రైనింగ్ ఇస్తున్నారు. జర్మన్ భాష నేర్చుకున్న అనంతరం మిగతా భాషలపై తర్ఫీదు ఇస్తారు. అలాగే నర్సింగ్ కాలేజీల్లోని విద్యార్థులకు కూడా జర్మన్ భాష నేర్పిస్తున్న సంగతి తెలిసిందే. 13 నర్సింగ్ కాలేజీలలోని సుమారు 2300 మంది విద్యార్థులకు జర్మన్ భాష నేర్పిస్తున్నారు. నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది.


అయితే ప్రభుత్వం ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని మన తెలుగు విద్యార్థులకు విదేశీ భాషలు నేర్పించడానికి కూడా ఓ కారణం ఉంది. జర్మనీ వంటి దేశాల్లో నర్సులకు మంచి డిమాండ్ ఉంది. అలాగే ఒక్కో ఉద్యోగానికి అక్కడ నెలకు కనీసం 2 లక్షల వరకూ జీతం చెల్లిస్తున్నారు. డిగ్రీ స్థాయి వరకూ జర్మన్ భాష నేర్చుకుంటే కచ్చితంగా అక్కడ ఉద్యోగాలు సంపాదించవచ్చనేదీ అధికారుల అంచనా. ఈ నేపథ్యంలో రాష్ట్ర యువతకు విదేశీ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం ఈ వసుధ ప్రాజెక్టును చేపడుతోంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa