కార్తీక మాసం సందర్భంగా ఆలయాలకు భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులకు పలు సూచనలు చేశారు. కాకినాడ జిల్లా పరిధిలోని ప్రముఖ ఆలయాల్లో భక్తుల భద్రత, సౌకర్యాల కల్పనపై యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఆలయాల్లో క్యూ లైన్ల నిర్వహణ, పారిశుద్ధ్య నిర్వహణతో పాటుగా భద్రతాపరమైన అంశాలపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆలయాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు పాటించాలని కాకినాడ జిల్లా కలెక్టర్, ఎస్సీలను పవన్ కళ్యాణ్ ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం కాకినాడ జిల్లా కలెక్టర్, ఎస్పీతోపాటు వివిధ శాఖల జిల్లా అధికారులకు పుణ్య క్షేత్రాలు, దేవాలయాలలో ఏర్పాట్లపై పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు.
కాకినాడ జిల్లా పరిధిలో సామర్లకోట కుమార భీమేశ్వరస్వామి ఆలయం, పిఠాపురం పాద గయ క్షేత్రం, అన్నవరం వీరవెంకట సత్యనారాయణ స్వామి ఆలయం వంటి ప్రధాన ఆలయాలు ఉన్నాయి. అలాగే మరికొన్ని ఆలయాలకు కూడా కార్తీక మాసంలో భక్తులు ఎక్కువ సంఖ్యలో తరలి వస్తుంటారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలని పవన్ కళ్యాణ్ అధికారులకు స్పష్టం చేశారు. కాశీబుగ్గ ఘటన నేపథ్యంలో దేవాదాయ శాఖ ఆలయాల దగ్గర తగిన జాగ్రత్తలు తీసుకోవాని సూచించారు.
ప్రముఖ ఆలయాలతో పాటుగా ప్రైవేట్ వ్యక్తులు, సంస్థల నిర్వహణలో ఎన్ని ఆలయాలు ఉన్నాయనే దానిపై దేవాదాయ శాఖ అధికారులు నివేదిక సిద్ధం చేసి కాకినాడ జిల్లా కలెక్టర్, ఎస్పీలకు తక్షణమే అందించాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అక్కడ కూడా రద్దీ విషయమై పర్యవేక్షణ చేయాలని సూచించారు. నవంబర్ 5వ తేదీ కార్తీక పౌర్ణమి నేపథ్యంలో ఆ రోజు, ఆ తర్వాతి రోజు ఆలయాల్లో భక్తుల రద్దీని అంచనా వేయాలని సూచించారు. శని, ఆది, సోమవారాల్లో భక్తుల సంఖ్య ఊహించని విధంగా పెరుగుతోందన్న పవన్ కళ్యాణ్.. ఆలయాలకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా దేవాదాయ, పోలీసు, పంచాయతీరాజ్, మున్సిపల్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తుల రద్దీకి తగిన విధంగా క్యూ లైన్ల నిర్వహణ ఉండాలని.. క్యూ లైన్లు, ఆలయ పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి.. నిరంతర పర్యవేక్షణ ఉంచాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు.
భక్తుల రద్దీకి తగిన విధంగా తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని.. చెత్త పేరుకుపోకుండా పారిశుధ్య నిర్వహణ చేపట్టాలన్నారు. అలాగే భక్తుల రద్దీకి తగిన విధంగా ఏపీఎస్ ఆర్టీసీ సంస్థ బస్సులు నడపాలని పవన్ కళ్యాణ్ సూచించారు. అలాగే రద్దీ వేళల్లో ఆయా క్షేత్రాల మీదుగా వెళ్లే జాతీయ రహదారులపై వాహనాల రాకపోకలను క్రమబద్దీకరిస్తూ ప్రమాదాలకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో దేవాలయాల వద్ద మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa