ఉన్నత విద్య కోసం ఇక్కడి నుంచి రష్యా వెళ్లిన ఓ భారతీయ విద్యార్థి దారుణమైన పరిస్థితుల్లో మరణించాడు. రాజస్థాన్లోని అల్వార్ జిల్లాకు చెందిన 22 ఏళ్ల అజిత్ సింగ్ చౌదరి.. పాలు తీసుకు వస్తానంటూ బయటకు వెళ్లాడు. 19 రోజుల క్రితం ఇలా బయటకు వెళ్లిన అతడు ఎట్టకేలకు ఈరోజు స్థానికంగా ఉన్న ఓ డ్యామ్లో శవమై కనిపించాడు. ఈ వార్త తెలుసుకున్న అతడి స్నేహితులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.
2023లో యుఫా నగరంలోని బష్కిర్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో అజిత్ సింగ్ చౌదరి ఎంబీబీఎస్ కోర్సులో చేరాడు. అప్పటి నుంచి అక్కడే చదువుతున్నాడు. అయితే అతడు అక్టోబర్ 10వ తేదీన హాస్టల్ నుంచి బయటకు వెళ్లాడు. "పాలు కొనుక్కుని అరగంటలో తిరిగి వస్తాను" అని తన స్నేహితులకు చెప్పిన అజిత్.. తిరిగి హాస్టల్కు చేరుకోలేదు. దీంతో అతని స్నేహితులు స్థానికంగా వెతికారు. ఎంతకూ లాభం లేకపోవడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఈక్రమంలోనే అజిత్ అదృశ్యమైన కొద్ది రోజులకే.. యుఫాలోని వైట్ నది సమీపంలో అజిత్కు సంబంధించిన దుస్తులు, మొబైల్ ఫోన్, షూల దొరికాయి. దీంతో పోలీసులు నదిలో అజిత్ గురించి గాలించడం ప్రారంభించారు. కొన్ని రోజులు పాటు చర్యలు చేపట్టినా ఎలాంటి లాభం లేకపోయింది. అయితే ఎట్టకేలకు అంటే ఈరోజు వైట్ నదిపై ఉన్న డ్యామ్ సమీపంలో అజిత్ మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. అతడి స్నేహితులను పిలిపించి మృతదేహాన్ని చూపించారు. ఈక్రమంలోనే వారంతా అతడిని చూసి ఆ మృతదేహం అజిత్దేనని ధృవీకరించారు.
అయితే ఈ విషయం తెలుసుకున్న అజిత్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. తమ కుమారుడిని ఎంబీబీఎస్ చదివించడానికి.. ఉన్న కొద్దిపాటి పొలాన్ని కూడా అమ్ముకున్నట్లు చెబుతున్నారు. తమ కొడుకు డాక్టర్ అయి తిరిగి వస్తాడనుకుంటే.. శవమై తిరిగి వస్తున్నాడంటూ గుండెలవిసేలా రోదిస్తున్నారు. ముఖ్యంగా అజిత్ తండ్రి రూప్ సింగ్, తల్లి సంత్రా దేవిని ఆపడం ఎవరి తరమూ కావట్లేదు.
యువ విద్యార్థి మరణించిన తీరు అనుమానాస్పదంగా ఉండటంతో.. దీనిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నాయకులు జితేంద్ర సింగ్ అల్వార్ ఈ విషయంపై స్పందించారు. అజిత్ మృతి అనుమానాస్పదంగా ఉందని పేర్కొంటూ.. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్కు లేఖ రాశారు. ఈ కేసుపై ముమ్మర దర్యాప్తు జరిపించి, విద్యార్థి మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కేంద్రాన్ని కోరారు. మృతదేహానికి పోస్ట్మార్టం పూర్తయిన తర్వాత భారత్ తీసుకొచ్చేందుకు మాస్కోలోని భారత రాయబార కార్యాలయం రష్యా అధికారులతో సమన్వయం చేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa