సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు అరుదైన చేపలు చిక్కాయి. దీంతో వారి పంట పడింది. రెండు చేపలు ఏకంగా రూ.1.65 లక్షలకు అమ్ముడుపోయాయి. కిలో రూ.3 వేలకుపైనే పలకడం గమనార్హం. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడుకు చెందిన 600 మంది మత్స్యకారులు రామేశ్వరం సమీపంలోని పంబన్ ఓడరేవు నుంచి 80 పడవల్లో సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. ఈ క్రమంలో నవంబరు 7 శుక్రవారం ఉదయం గల్ఫ్ ఆఫ్ మన్నార్ వద్ద వారు వేట మొదలుపెట్టి, వివిధ రకాల చేపలతో తీరానికి చేరుకున్నారు.
అందులోని ఓ పడవలోని మత్స్యకారుల వలకు 22 కేజీలు, ఇంకోటి 24 కేజీలు బరువున్న రెండు పెద్ద క్యాట్ ఫిష్లు పడ్డాయి. వేలంలో ఈ రెండు చేపలను కొనుగోలు చేయడానికి పోటీపడ్డారు. చివరకు కిలో రూ.3,600 చొప్పున రూ.1.65 లక్షలకు విక్రయించారు. ఔషధ గుణాలు ఉండే క్యాట్ పిష్లను ఖరీదైన సూప్ల తయారీలో వాడుతారని మత్స్యకారులు తెలిపారు. ఇది అసాధారణమైనప్పటికీ ఈ ప్రాంతంలో లభ్యమయ్యే ఇతర చేపలకు సైతం వాటి ఔషధ గుణాలు లేదా అరుదైన గుణాల కారణంగా అధిక ధరలకు అమ్ముడుపోతుంటాయి. ఉదాహరణకు టెలియా భోలా (ఘోల్ పిష్) చేప కిలో వేలల్లో ఉంటుంది. అయితే, తాజాగా, వలకు చిక్కిన క్యాట్ షిఫ్ నిర్దిష్ట జాతి ఏంటి అనేది తెలియరాలేదు. కానీ అధిక ధర చెల్లించడాన్ని బట్టి నిర్దిష్ట ఔషధ గుణాలు ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ ఏడాది జులైలో పాంబన్ దీవిలో వేటకు వెళ్లిన తమిళనాడు మత్స్యకారులకు విచిత్రంగా తోక లేకుండా రెక్కలాంటి శరీరంతో ఉండే 8 కిలోల చేప వలకు చిక్కింది. అయితే, అరుదైన సన్ఫిష్ అని శాస్త్రవేత్తలు తెలిపారు. తోక లేకుండా ఉండే ఈ చేప.. ఎక్కువగా తూర్పు పసిఫిక్ తీరంలో కనిపిస్తుంది. 200 నుంచి 600 మీటర్ల లోతులో తిరుగుతూ… రోజుకు 26 కిలోమీటర్ల వరకూ ఈదే సామర్థ్యం దీనికి ఉంటుంది. దీనికి ముందు టన్ను బరువున్న రే-ఫిష్ మత్స్యకారుల వలకు చిక్కగా.. అది రూ.56 వేలకు అమ్ముడుపోయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa