ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మృతదేహంలో రక్తప్రసరణ పునరుద్ధరించి.. కిడ్నీ, కాలేయం సేకరణ

national |  Suryaa Desk  | Published : Sun, Nov 09, 2025, 07:34 PM

దేశ వైద్యరంగంలో చరిత్ర సృష్టిస్తూ ఢిల్లీ వైద్యులు ఒక అరుదైన ఘనతను సాధించారు. మరణించిన వ్యక్తి మృతదేహంలో కృత్రిమంగా రక్త ప్రసరణను పునఃప్రారంభించడం ద్వారా అవయవాలను విజయవంతంగా సేకరించి.. దానం చేశారు. తద్వారా నలుగురి ప్రాణాలు కాపాడారు. హీసీఎంసీటీ మణిపాల్ హాస్పిటల్, ద్వారక వైద్య బృందం ఆసియాలోనే తొలి సారిగా ఈ అత్యంత క్లిష్టమైన ప్రక్రియను నిర్వహించింది.


మోటార్ న్యూరాన్ డిసీజ్‌తో బాధపడుతూ.. నవంబర్ 6వ తేదీ రాత్రి 8.43 గంటలకు మరణించిన 55 ఏళ్ల గీతా చావ్లా మృతదేహంపై ఈ ప్రక్రియ జరిగింది. మొదటి నుంచి అవయవాలను దానం చేయాలనే ఆమె ఆకాంక్షను గౌరవించిన కుటుంబ సభ్యులు.. వైద్య బృందానికి పూర్తి సహకారం అందించారు. ఇలా వైద్యులు "నార్మోథెర్మిక్ రీజినల్ పెర్ఫ్యూషన్" అనే అధునాతన విధానాన్ని ఉపయోగించారు. ఈ పద్ధతిలో ఎక్స్‌ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజినేటర్ అనే ప్రత్యేక పరికరం సహాయంతో గుండె ఆగిన తర్వాత కూడా అవయవాలకు రక్త ప్రసరణ, ఆక్సిజన్ సరఫరాను కొనసాగించారు.


సాధారణంగా భారత్‌లో అవయవదానం గుండె కొట్టుకుంటూ ఉండే 'బ్రెయిన్ డెత్' తర్వాతే జరుగుతుంది. కానీ ఈ కేసు 'డొనేషన్ ఆఫ్టర్ సర్క్యులేటరీ డెత్' కోవకు చెందుతుంది. అంటే గుండె ఆగిపోయిన తర్వాత అవయవదానం చేయడం. సాధారణంగా డీసీడీ కేసుల్లో అవయవాలు త్వరగా పాడైపోతాయి. కానీ ఎన్‌ఆర్పీ ద్వారా వైద్యులు కాలేయం, మూత్ర పిండాలను సజీవంగా ఉంచి భద్రంగా తీయగలిగారు. ఇదే విషయాన్ని మణిపాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రిటికల్ కేర్ మెడిసిన్ చైర్మన్ డాక్టర్ శ్రీకాంత్ శ్రీనివాసన్ తెలిపారు. నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్ ద్వారా సేకరించిన అవయవాలను వెంటనే కేటాయించారు. గీతా చావ్లా కాలేయాన్ని 48 ఏళ్ల వ్యక్తికి, ఆమె రెండు మూత్రపిండాలను 63, 58 ఏళ్ల పురుషులకు విజయవంతంగా మార్పిడి చేశారు.


మణిపాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గాస్ట్రోఎంటరాలజీ చైర్మన్ డాక్టర్ అవ్నీష్ సేథ్ మాట్లాడుతూ.. ఈ విజయం భారత వైద్య రంగానికి కొత్త దిశానిర్దేశం చేస్తుందని పేర్కొన్నారు. ఈ సాంకేతికత ద్వారా భవిష్యత్తులో గుండె, ఊపిరితిత్తులు వంటి సున్నితమైన అవయవాలను కూడా రక్షించవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గీతా చావ్లా కుటుంబం తీసుకున్న ఈ నిర్ణయం అనేక మంది రోగులకు కొత్త జీవాన్ని ప్రసాదించిందని పేర్కొన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa