కేన్సర్ భూతం ప్రపంచానికి పెను ముప్పుగా పరిణమించింది. ప్రపంచ మరణాల్లో గుండె జబ్బుల తర్వాత కేన్సర్ది రెండో స్థానం. ఇక, భారత్లోనూ కేన్సర్ మహమ్మారి కోరలు చాస్తోంది. ఏటా లక్షల మంది ఈ వ్యాధి బారినపడుతున్నారు. ఒక్క 2022లోనే దాదాపు 15 లక్షల మంది కొత్తగా కేన్సర్ బారినపడినట్టు నివేదికలు పేర్కొన్నాయి. ప్రపంచంలో కేన్సర్ మరణాలు తగ్గుతుంటే.. భారత్లో పెరుగుతున్నట్టు ఓ అధ్యయనం హెచ్చరించింది. ముఖ్యంగా రొమ్ము, పెద్దపేగు, సర్వైకల్, ప్రొస్టేట్, గర్భాశయ, పాంక్రియాస్, ఊపిరితిత్తులు, యుటెరస్ వంటి కేన్సర్లు భారీగా పెరుగుతున్నాయి. ఇందుకు కేవలం ధూమపానం వంటివే కాకుండా జీవనశైలి, ఆహారపు అలవాట్లు సైతం కారణమని లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ జ్యోతికా రాజావత్ షా తెలిపారు.
మనం రోజువారీగా వినియోగించే 200 రకాల వస్తువులు కేన్సర్ కారకాలేనని తాజా అధ్యయనాల్లో గుర్తించినట్లు ఆమె వివరించారు. జంక్ ఫుడ్, ఒకసారి వాడిన నూనె, రసాయన పూతతో కూడిన ప్యాకేజీలు ఈ జాబితాలో ఉన్నాయని అమె పేర్కొన్నారు. నూనెను 100 డిగ్రీల కంటే అధిక ఉష్ణోగ్రతతో పలుసార్లు వేడి చేసినప్పుడు కేన్సర్ కారక రసాయనాలు విడుదలవుతాయని అన్నారు. అలాగే, మనం వినియోగించే ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లకు ఎండ తగిలితే రసాయనాలు విడుదలై నీటిలో కరిగి ప్రమాదకరంగా మారుతాయని చెప్పారు.
క్యాండీలు, చైనీస్ ఫుడ్ సాస్లు, ఎరుపు లేదా ఆరెంజ్ వంటి కృత్రిమ రంగులతో కూడిన స్నాక్స్లోనూ హానికర రసాయనాలు ఉంటాయని డాక్టర్ జ్యోతికా హెచ్చరించారు. టీ బ్యాగులు, డిస్పోజబుల్ గ్లాసులు, కప్పులపై ఉండే మైక్రోవేవ్ ప్లాస్టిక్ కంటెయినర్లు, ప్లాస్టిక్ కోటింగ్ వేడికి గురైనప్పుడు హానికారక రసాయనాలను విడుదల చేస్తాయని ఆమె వెల్లడించారు.
దేశంలోని మహిళల్లో రొమ్ము, గర్భాశయ కేన్సర్లు ముప్పు ఎక్కువగా ఉందని, 50-60 శాతం మంది పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు కేన్సర్ లక్షణాలపై అవగాహన లేదని పేర్కొన్నారు.. దీంతో సకాలంలో చికిత్స అందక ప్రాణాంతకంగా మారుతున్నాయని చెప్పారు. రొమ్ము, గర్భాశయ ముఖద్వార కేన్సర్లకు సంబంధించి మహిళలు స్వీయ పరీక్షలు చేసుకుని, ఏవైనా మార్పులు గమనిస్తే వైద్యులను సంప్రదించాలని అన్నారు. కేన్సర్ నిర్మూలనలో జీవనశైలి, ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పించడం ఎంతో కీలకమని సూచించారు. అలాగే, ప్లాస్టిక్ వినియోగం, ప్రాసెస్డ్ ఫుడ్, ఒకసారి వినియోగించి నూనెను మళ్లీ వినియోగించడం తగ్గిస్తే కేన్సర్ ముప్పును గణనీయంగా తగ్గించవచ్చని ఆమె సూచించారు. అలాగే, గత కొన్ని దశాబ్దాల నుంచి కేన్సర్ బాధితుల సంఖ్య పెరుగుతూ ఉండగా... కేవలం 2 శాతం మంది మాత్రమే తమకు కేన్సర్ ఉన్నట్టు భావిస్తున్నారని ఓ అధ్యయనంలో తేలింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa