రాష్ట్రంలో ట్రాఫిక్ నిబంధనల అమలులో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే పద్ధతులకు స్వస్తి పలకాలని, చలానాలు విధించడానికి ముందు అవగాహన కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలు, తొక్కిసలాటలు, అగ్నిప్రమాదాల వంటివి పునరావృతం కాకుండా నివారించేందుకు పటిష్టమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. సోమవారం సచివాలయంలోని ఆర్టీజీఎస్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనల అంశంపై సీఎం కీలక సూచనలు చేశారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపేవారికి, సీట్ బెల్ట్ పెట్టుకోని వారికి ముందుగా దాని ఆవశ్యకతను వివరించాలని చెప్పారు. భారీగా చలానాలు విధించాలన్న అధికారుల ప్రతిపాదనను ఆయన సున్నితంగా తిరస్కరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారి ఫోన్లకు ముందుగా హెచ్చరిక మెసేజ్లు పంపాలని, ఆ తర్వాత కూడా వారు మారకపోతేనే చలానాలు విధించాలని స్పష్టం చేశారు. దీనివల్ల, తాను తప్పు చేసినందుకే జరిమానా పడిందన్న భావన ప్రజల్లో కలుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ విధానం కోసం కేరళ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఇటీవల జరిగిన ప్రమాదాలపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి, శాశ్వత పరిష్కారాల కోసం వారం రోజుల్లోగా ప్రామాణిక కార్యాచరణ విధానాలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa