సనాతర ధర్మం పరిరక్షణపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సతానత ధర్మ పరిరక్షణకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయడానికి ఇదే సరైన సమయం అని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు.. తిరుమల తిరుపతి దేవస్థానం ఒక తీర్థయాత్ర క్షేత్రం కంటే ఎక్కువ అని చెప్పారు. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో సిట్ వివరాలు వెల్లడించిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ మేరకు ఎక్స్ వేదికగా డిప్యూటీ సీఎం పోస్టు పెట్టారు.
"ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ సమాజానికి.. తిరుమల తిరుపతి దేవస్థానం కేవలం పుణ్య క్షేత్రమే కాదు.. ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక చిహ్నం. తిరుపతి లడ్డూ కేవలం మిఠాయి మాత్రమే కాదు.. అది అందరిలో ఉండే భావోద్వేగం. తిరుపతి లడ్డూను అప్యాయంగా స్నేహితులు, కుటుంబ సభ్యులతో పాటు ముఖపరిచయం లేని వాళ్లకు పంపిణీ చేస్తాము. తిరుపతి లడ్డూను ఇలా అందజేయడం.. హిందువుల సమష్టి విశ్వాసాన్ని, నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రతి సంవత్సరం సగటున దాదాపు 2.5 కోట్ల మంది భక్తులు తిరుమలను సందర్శిస్తారు. ఇలాంటి సనాతన భావాలు, ఆచారాలను ఎగతాళి చేస్తే హిందువులకు ఎంతో ఆవేదన కలుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది హిందువుల నమ్మకాన్ని, భక్తిని విచ్ఛిన్నం చేస్తుంది" అని పవన్ కళ్యాణ్ పోస్టులో పేర్కొన్నారు.
ఇదే సరైన సమయం..
"లౌకికవాదం రెండు వైపులా ఉండాలి. హిందువుల విశ్వాసాలపై బేరసారాలు చేయలేం. మా సనాతన ధర్మం అత్యంత పురాతనమైనది. నిరంతరం అభివృద్ధి చెందుతున్న నాగరికత. అలాంటి సనాతన ధర్మం కోసం.. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును స్థాపించడానికి ఇదే సరైన సమయం" అని పవన్ కల్యాణ్ చెప్పారు.
సనాతన ధర్మ పరిరక్షణకు జాతీయ రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక చట్టం, బోర్డు ఏర్పాటు చేయాలని గతంలోనూ పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఈ మేరకు వారాహి డిక్లరేషన్లో పేర్కొన్న ఈ డిమాండ్ను.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందు పెట్టారు. 2024లో అక్టోబర్లో తిరుపతిలో జరిగిన సభలో సనాతన ధర్మంపై కీలక వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. సనాతన ధర్మం కోసం తాను ఏదైనా వదులుకోవడానికి సిద్ధం అని చెప్పారు. తిరుమలలో అపచారం జరుగుతోందని చెబితే.. గత ప్రభుత్వం పట్టించుకోలేదని.. అందుకే వారికి 11 సీట్లు వచ్చినట్లు ఎద్దేవా చేశారు. సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామని అన్నవారితో గొడవ పెట్టుకునేందుకే తిరుపతికి వచ్చినట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. లౌకిక వాదం పేరుతో హిందువుల నోరు నొక్కేస్తున్నారని.. హిందువులకు అన్యాయం జరిగితే ఏ సెక్యులరిస్టు నోరు మెదపరు అంటూ నిలదీశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa