సముద్రంలో ఈది పిల్లకాలువలో మునిగి చచ్చినట్లు.. అని మన పెద్దోళ్లు చెప్పిన మాట గుర్తుందా.. అలాగే ఉంది ఈ దొంగల యవ్వారం. పేరుకేమో అంతర్రాష్ట్ర దొంగల ముఠా . ఒకొక్కక్కరిపై పదుల సంఖ్యలో కేసులు.. కానీ ఓ చిన్న తప్పుతో పోలీసులకు దొరికిపోయారు. అది కూడా చెప్పుల కారణంగా.. దీంతో ప్రస్తుతం ఊచలు లెక్కబెట్టాల్సి వస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన తరుణ్ కుమార్ రాజు, ఎలెయ్ రాజు, మావుళ్లు, లోకేష్, రాజి, మరో బాలిక. వీరంతా చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. భీమవరంలోని చిన్నపేటలో ఉంటారు. అయితే చిన్నప్పుడే వీరి జీవితం గాడి తప్పింది. చెడు వ్యసనాలకు అలవాటు పడ్డారు. ఈ వ్యసనాల కోసం డబ్బులు అవసరమయ్యాయి. దీంతో దొంగతనాలు ప్రారంభించారు.
వీరిలో తరుణ్ కుమార్ రాజు మీద ఇప్పటికే 41 కేసులు ఉన్నాయి. ఎలెయ్ రాజుపై 30 కేసులు ఉన్నాయి. అయితే వీరంతా ఓ ముఠాగా ఏర్పడ్డారు. గోదావరి జిల్లాల్లో చోరీలు మొదలుపెట్టారు. ఒకటీ రెండు కాదు భారీ సంఖ్యలో చోరీలు చేశారు. ఈ చోరీ సొమ్మును బాలికకు, లోకేష్కు అందిస్తూ వచ్చారు.ఈ క్రమంలోనే ఈ ఏడాది మే నెలలో పోలీసులకు దొరికిపోయారు. కొన్ని రోజులు రాజమండ్రి జైలులో రిమాండ్లో ఉన్నారు. అక్టోబర్ నెలలో రాజమండ్రి జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చారు. అయితే ఆ తర్వాతే మనోళ్లు ప్లాన్ మార్చారు. గోదావరి జిల్లాల్లో చోరీలు చేస్తే దొరికిపోతామనే భయంతో.. తమ మకాం హైదరాబాద్కు మార్చారు.
నవంబర్ నాలుగో తేదీన ఈ ఐదుగురు. మరో బాలిక కలిసి హైదరాబాద్కు బస్సులో బయల్దేరారు. అయితే ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్దకు రాగానే ఓ బైక్ చోరీ చేసేందుకు మంచి అవకాశం వచ్చింది. దీంతో బైక్ చోరీ చేశారు. నవంబర్ ఐదో తేదీన నాదర్గుల్లోని కమ్మగూడలో గది అద్దెకు తీసుకున్నారు. ఆ రోజే హయత్నగర్ వద్ద మరో బైక్ చోరీ చేశారు. ఈ రెండు బైక్లపై తిరుగుతూ ఆలయాలు, షాపులు, ఇళ్లు ఇలా వరుసగా 12 చోట్ల దొంగతనాలకు పాల్పడ్డారు. ఈ డబ్బులతో కమ్మగూడ చేరుకున్నారు. అక్కడే పార్టీ చేసుకుని.. అదే రోజు భీమవరం వెళ్లిపోయారు. అయితే మరోసారి చోరీ చేయాలని నిర్ణయించుకుని నవంబర్ 7న మరోసారి అద్దెకు తీసుకున్న గదికి చేరారు.
మరోవైపు హైదరాబాద్లో వరుస చోరీలతో పోలీసులు అలర్ట్ అయ్యారు. సౌత్ఈస్ట్, టాస్క్ఫోర్స్ పోలీసులు దొంగల కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే దొంగల వేలిముద్రలు, సీసీ టీవీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించారు. అయితే ఎలాంటి ఉపయోగం లేకపోయింది. అయితే ఐఎస్ సదన్ పరిసరాల్లోని సీసీ టీవీ ఫుటేజ్లో.. బైక్ మీద వెళ్తున్న ఇద్దరు యువకుల బూట్లు, చెప్పులు పోలీసులకు వింతగా కనిపించాయి.అలాగే వారి తీరుపైనా అనుమానం కలిగింది. వీటి ఆధారంతో చంపాపేట్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ చెప్పులు ధరించిన యువకుడు ద్విచక్రవాహనంపై వస్తున్నట్టు గమనించారు. అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించటంతో.. చోరీ చేసినట్టు అంగీకరించారు. ఈ నేపథ్యంలో ఐదుగురు నిందితులు, బాలికను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు బైక్లు, రూ.17,104 నగదు, నాలుగు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిని రిమాండ్కు తరలించిన పోలీసులు.. బాలికను జువనైల్ హోమ్కు తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa