భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్ట్కు సమయం ఆసన్నమవుతోంది. శుక్రవారం నుంచి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి టెస్టు జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే రెండు జట్లూ కూడా.. ఈడెన్కు చేరుకుని.. ప్రాక్టీస్ ప్రారంభించాయి. అయితే టీమిండియా తుది జట్టు ఎంపికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఈ ఏడాది రెడ్బాల్ క్రికెట్లో పరుగుల వరద పారిస్తున్న ధ్రువ్ జురెల్కు చోటు దక్కుతుందా? లేదా? అన్నది సందేహంగా మారింది. రిషభ్ పంత్ ఉండటంతో.. వికెట్ కీపర్గా అతడే ఖాయం. కానీ సూపర్ ఫామ్లో ఉన్న జురెల్ను ఆడించాలనే డిమాండ్లు వస్తున్నాయి.
తొలి టెస్టుకు ముందు మీడియాలో మాట్లాడిన టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కాటే.. ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. టీమిండియా తుది జట్టులో రిషభ్ పంత్తో పాటు ధ్రువ్ జురెల్ కూడా ఉంటాడని ధ్రువీకరించాడు.
“సూపర్ ఫామ్లో ఉన్న ధ్రువ్ జురెల్ను తొలి టెస్టు తుది జట్టు నుంచి పక్కన పెట్టే పరిస్థితి లేదు. కానీ మనం కేవలం 11 మందిని మాత్రమే ఆడించగలం. ఈ కారణంతోనే కొందరికి తుది జట్టులో చోటు ఉండదు. కానీ ధ్రువ్ జురెల్ గత ఆరు నెలలుగా మంచి రిథమ్లో ఉన్నాడు. దక్షిణాఫ్రికా ఎతో రెండో అనధికారిక టెస్ట్లో రెండు సెంచరీలు కొట్టాడు. ఏది ఏమైనా అతడు తుది జట్టులో తప్పకుండా ఉంటాడు. రిషభ్ పంత్ కూడా ఈ మ్యాచ్లో ఆడతాడు” అని ర్యాన్ టెన్ డస్కాటే వెల్లడించాడు.
కాగా ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్లో గాయపడ్డ రిషభ్ పంత్.. ఈ సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. పంత్.. వికెట్ కీపర్ కమ్ బ్యాటర్గా.. ధ్రువ్ జురెల్ స్పెషలిస్ట్ బ్యాటర్గా కోల్కతా టెస్ట్లో బరిలోకి దిగే అవకాశం ఉంది.
దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టు..
శుభ్మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవ్దత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీశ్ కుమార్ రెడ్డి, సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa