గుజరాత్లోని పల్లెటూళ్లలో పాడి పరిశ్రమ ఎంతటి ఆర్థిక శక్తిని ఇవ్వగలదో నిరూపించారు 65 ఏళ్ల మనిబెన్ జేసుంగ్ చౌదరి . సాధారణంగా 65 ఏళ్ల వయసు అంటే.. ఇంట్లో ఓ మూలకు పరిమితమై.. ఎవరు ఏ ముద్ద వేస్తే అది తిని.. కృష్ణా రామా అనుకుంటూ కాలం వెళ్లదీస్తారు. కానీ మనిబెన్ జేసుంగ్ చౌదరి మాత్రం.. కష్టపడి పశుపోషణ చేసి.. భారీగా డబ్బులను సంపాదిస్తున్నారు. బనస్కాంత జిల్లాలోని కసారా గ్రామానికి చెందిన మనిబెన్ జేసుంగ్ చౌదరి.. తన కృషి, సహకార స్ఫూర్తితో అద్భుతమైన విజయాన్ని సాధించి.. దేశంలోని కోట్ల మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
మనిబెన్ జేసుంగ్ చౌదరి.. తనకు ఉన్న సాధారణ పశువుల పాకను పాడి పరిశ్రమకు ఒక నమూనా కేంద్రంగా తీర్చిదిద్దారు. ఆమె రోజుకు దాదాపు 1,100 లీటర్ల పాలను.. ఉత్పత్తి చేసి.. పటేల్వాస్ (కసారా) మిల్క్ ప్రొడ్యూసర్స్ కో ఆపరేటివ్ సొసైటీకి సరఫరా చేస్తున్నారు. ఇక 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆమె మొత్తం 3.47 లక్షల లీటర్ల పాలను విక్రయించి.. రూ.1.94 కోట్ల ఆదాయం సంపాదించారు. ఈ అద్భుతమైన విజయానికి గాను.. మనిబెన్ జేసుంగ్ చౌదరిని బనస్కాంత జిల్లాలోని ప్రతిష్టాత్మక "బెస్ట్ బనస్ లక్ష్మి" విభాగంలో రెండో స్థానాన్ని దక్కించుకున్నారు.
2011లో కేవలం 10, 12 పశువులతో మనిబెన్ జేసుంగ్ చౌదరి పాల ఉత్పత్తి ప్రయాణం ప్రారంభమైంది. ఇప్పుడు బన్నీ, మెహ్సాని, ముర్రా గేదెలు, హెచ్ఎఫ్ ఆవులు, స్వదేశీ కంక్రేజ్ జాతులతో సహా 230కి పైగా పశువులు ఆమె వద్ద ఉన్నాయి. మనిబెన్ చిన్న కుమారుడు, గ్రాడ్యుయేట్ అయిన విపుల్ మాట్లాడుతూ.. బనాస్ డైరీ సరైన మార్గదర్శకత్వంతో.. తాము ఈ రంగంలో బాగా అభివృద్ధి చెందుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తమ వద్ద 140 గేదెలు, 90 ఆవులు, 70 దూడలు ఉన్నాయి. ఈ ఏడాది.. తాము పాలను ఉత్పత్తిని పెంచడానికి మరో 100 గేదెలను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏడాది చివరి నాటికి రూ.3 కోట్లకు పైగా విలువైన పాలను విక్రయించడానికి సిద్ధమవుతున్నామని తెలిపారు.
మనిబెన్ జేసుంగ్ చౌదరి ముగ్గురు కుమారులు గ్రాడ్యుయేట్లు అయినప్పటికీ.. వారు పూర్తిగా ఈ పాడి పరిశ్రమలోనే పనిచేస్తున్నారు. ఆధునిక మిల్కింగ్ యంత్రాల సహాయంతో ఆవులు, గేదెలకు పాలు పితుకుతున్నారు. ప్రస్తుతం మనిబెన్ జేసుంగ్ చౌదరితో పాటు దాదాపు 16 కుటుంబాలు పశుపోషణ చేస్తున్నారు. గుజరాత్లో పాడి పరిశ్రమ, ముఖ్యంగా మహిళా సహకార సంఘాల ద్వారా నడుస్తూ.. సుమారు 11 లక్షల మంది మహిళా సభ్యులకు ఉపాధి కల్పిస్తోంది. మనిబెన్ జేసుంగ్ చౌదరి విజయంతో.. యువతకు గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న ఆదాయ అవకాశాలను తెలియజేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa