ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిఘా సంస్థలకు అనుమానం రాకుండా,,,,'బిర్యానీ', 'దావత్' కోడ్ నేమ్‌లతో ఉగ్ర కుట్రలు

national |  Suryaa Desk  | Published : Mon, Nov 17, 2025, 08:22 PM

ఢిల్లీ ఎర్రకోట పేలుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఉగ్రదాడిపై ఇప్పటికే దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. హర్యానాలోని ఫరీదాబాద్‌లో బయటపడ్డ వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్‌ సభ్యులను అధికారులు విచారిస్తున్నారు. ఈ సందర్భంగా కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా భారీ ఉగ్రదాడులకు కుట్ర చేసిన డాక్టర్ షాహిన్ షాహిద్‌ను 'మేడమ్ సర్జన్' కోడ్‌నేమ్తో వ్యవహిరించారు. తాజాగా సమాచారం ఇచ్చిపుచ్చుకునే సమయంలోనూ అలాంటి మరిన్ని కోడ్‌నేమ్‌లు వాడినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తెలంగాణలో ఎక్కువగా ఉపయోగించే బిర్యానీ, దావత్ వంటి కోడ్‌నేమ్‌లు ఉపయోగించారని దర్యాప్తులో వెల్లడైంది. దీంతో ఉగ్రవాదులకు.. తెలంగాణతో ఏమైనా సంబంధం ఉందా అని సర్వత్రా ఆందోళనలు నెలకొన్నాయి.


ఫరీదాబాద్‌లో దొరికిన ఉగ్రవాదులు.. టెలిగ్రామ్ యాప్‌లో సమాచారం ఇచ్చిపుచ్చుకునేటప్పుడు.. నిఘా సంస్థలకు పట్టుబడకుండా ఉండేందుకు.. వంట పదార్థాల పేర్లు వాడుకునేవారని దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది. టెర్రర్ మాడ్యూల్ సభ్యులు.. ముజ్మిల్ షకీల్, ఉమ ఉన్ నబీ, షాహీన్ షాహిద్, ఆదిల్ అహ్మద్ రాథెర్.. ఉగ్రదాడుల గురించి ప్లాన్లను చర్చించుకోవడానికి 'బిర్యానీ', 'దావత్' అనే కోడ్‌నేమ్‌లను ఉపయోగించేవారని సమాచారం. ఇక టెలీగ్రామ్‌లో ఎండ్‌ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉంటుంది కాబట్టి.. నిఘా సంస్థలకు దొరక్కుండా ఉగ్రవాదులు జాగ్రత్త పడ్డట్లు తెలుస్తోంది.


'బిర్యానీ', 'దావత్' అర్థాలు ఇవే..


ఉగ్రదాడుల గురించి చర్చించుకునేటప్పుడు.. విషయాన్ని ఇతరులకు చెప్పేలా ఈ కోడ్ వర్డ్స్ వాడేవారని తెలుస్తోంది. అందులో భాగంగా పేలుడు పదార్థం గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు బిర్యానీ అని చెప్పేవారట. ఇక ఏదైనా ప్రత్యేకమైన కార్యక్రమం గురించి మాట్లాడాల్సి వస్తే.. దావత్ అని చెప్పుకునేవారని సమాచారం. ఇక దాడి గురించి పేలుడు పదార్థం సిద్ధం అయిందని చెప్పేందుకు.. దావత్ కోసం బిర్యానీ రెడీ అయిందని అనేవారట. అయితే ఈ రెండు పదాలను తెలంగాణ ప్రజలు ముఖ్యంగా హైదరాబాద్ వాసులు ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే ఈ కోడ్‌నేమ్‌లు ఉపయోగించిన ఫరీదాబాద్‌ టెర్రర్ మాడ్యూల్‌తో.. హెదరాబాద్, తెలంగాణకు సంబంధం ఉన్నట్లు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం రాలేదు.


కాగా, ఈ వైట్ కాలర్ ఉగ్ర ముఠాకు సూత్రధారి జమ్మూకాశ్మీర్‌లోని సోఫియా జిల్లాకు చెందిన ఇమామ్ అహ్మద్‌గా పోలీసులు గుర్తించారు. అతడు ఢిల్లీ ఎర్రకోట్ల ఆత్మాహుతి దాడికి పాల్పడిన పుల్వామా వైద్యుడు ఉమర్ నబీ దగ్గరికి.. 2020లో తన కుమారుడి చికిత్స కోసం వచ్చాడు. అనంతరం నబీని ర్యాడికలైజ్ చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ తరచూ ఆసుపత్రిలో చికిత్స నెపంతో కలుస్తుండేవారు. ఆ తర్వాత నబీ.. ఉగ్ర కార్యకలాపాలు చేయగలిగిన డాక్టర్లను గుర్తించి.. వారిని అహ్మద్ దగ్గరికి తీసుకెళ్లేవాడు. అలాంటి వారందరికీ అహ్మద్.. టెలీగ్రామ్‌లో ఉగ్రవాదం గురించి బ్రెయిన్ వాష్ చేసేవాడు.


దర్యాప్తు సంస్థలు ఇప్పటికే వెల్లడించిన వివరాల ప్రకారం.. అహ్మద్ ఉగ్రవాదులుగా మార్చిన వాళ్లు అంతా.. కాశ్మీర్‌లో ఓ చోట పాకిస్తాన్ ప్రేరేపిత జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ ఉగ్రవాదులతో కలిశారు. ఈ సమావేశాన్ని అహ్మద్ ఏర్పాటు చేశాడు. అక్కడ కొత్త ఉగ్రవాదులకు జైషే సభ్యులు.. రెండు ఏకే సిరీస్ రైఫిల్స్ ఇచ్చారు. అందులో ఒకటి షాహీన్ షాహిద్ ఉపయోగించిన కారు నుంచి స్వాధీనం చేసుకున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa