బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాఘట్బంధన్ ఘోరంగా పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో 145 సీట్లలో పోటీ చేసిన ఆర్జేడీ కేవలం 25 సీట్లకే పరిమితం కావడం ఆ పార్టీని తీవ్రంగా దెబ్బకొట్టింది. తేజస్వీ యాదవ్ నేతృత్వంలో ఆ పార్టీ ఎన్నికలకు వెళ్లగా.. ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఇక ఈ ప్రభావం లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో అంతర్గత కలహాలు బయటికి వచ్చేలా చేశాయి. ఈ ఘోరపరాజయం నుంచి తేరుకోకముందే.. లాలూ కుటుంబానికి మరో షాక్ తగిలింది. ఆయన కూతురు రోహిణి ఆచార్య.. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా కుటుంబంతో కూడా సంబంధాలు తెంచుకుంటున్నట్లు చేసిన ప్రకటన సంచలనంగా మారింది.
ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజునే.. లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు రోహిణి ఆచార్య కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించడమే కాకుండా.. తన కుటుంబంతో సంబంధాలు పూర్తిగా తెంచుకుంటున్నట్లు తెలిపారు. ఈ ప్రకటన ఆర్జేడీలో తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపింది. లాలూ కుటుంబంలో తలెత్తిన ఈ అంతర్గత విభేదాల మధ్య.. లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ తన సోదరి రోహిణి ఆచార్యకు మద్దతు ప్రకటించారు. రోహిణి ఆచార్య పట్ల తమ కుటుంబం వ్యవహరించిన తీరు అంగీకరించలేనిదని వ్యాఖ్యానించారు.
లాలూ కుటుంబ సభ్యులు, రాజకీయ నేపథ్యం
బిహార్ మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్, భార్య రబ్రీ దేవిలకు 1973లో వివాహం జరిగింది. వీరికి మొత్తం తొమ్మిది మంది సంతానం కాగా.. వారిలో ఏడుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు.
మిసా భారతి (కూతురు)
1975-1977 దేశంలో ఎమర్జెన్సీ విధించిన సమయంలో లాలూ ప్రసాద్ యాదవ్ జైలులో ఉండగా మిసా భారతి జన్మించారు. అందుకే ఆమెకు మిసా చట్టం పేరు పెట్టారు. మిసా భారతి ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. 2024 లోక్సభ ఎన్నికల్లో పాట్నా నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు.
తేజస్వీ ప్రసాద్ యాదవ్ (చిన్న కుమారుడు)
లాలూ ప్రసాద్ యాదవ్ చిన్న కుమారుడైన తేజస్వీ ప్రసాద్ యాదవ్.. ప్రస్తుతం రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధినేతగా ఉన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత ఆయన రాజకీయ వారసత్వాన్ని అందుకున్నారు. బిహార్ డిప్యూటీ సీఎంగా కూడా పనిచేశారు. ఇటీవలి ఎన్నికల్లో మహాఘట్బంధన్ సీఎం అభ్యర్థిగా కూడా ఉన్నారు. 12వ తరగతి తర్వాత చదువును ఆపేసిన తేజస్వీ ప్రసాద్ యాదవ్.. క్రికెట్ వైపు ఇష్టంతో రంజీల్లో ఆడాడు. ఆ తర్వాత ఆటకు రిటైర్మెంట్ ప్రకటించి ఎన్నికల్లోకి దిగారు.
తేజ్ ప్రతాప్ యాదవ్ (పెద్ద కుమారుడు)
2015లో మహువా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా తేజ్ ప్రతాప్ యాదవ్ గెలిచారు. బాధ్యతారహిత ప్రవర్తన కారణంగా తేజ్ ప్రతాప్ యాదవ్ను 2025లో లాలూ ప్రసాద్ యాదవ్.. కుటుంబం నుంచి మాత్రమే కాకుండా పార్టీ నుంచి కూడా బహిష్కరించారు.
రాజ్ లక్ష్మి (చిన్న కూతురు)
రాజ్ లక్ష్మి లాలూకు చిన్న కుమార్తె కాగా.. ఆమె ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. దివంగత సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ మనవడు తేజ్ ప్రతాప్ సింగ్ యాదవ్ను.. రాజ్ లక్ష్మి పెళ్లి చేసుకున్నారు. ఆమె రాజకీయాలకు దూరంగా ఉంటారు.
అనుష్క రావు (కూతురు)
అనుష్క రావు.. ఇంటీరియర్ డిజైనర్, న్యాయశాస్త్రం చదివారు. హర్యానా విద్యుత్ శాఖ మంత్రి అజయ్ సింగ్ యాదవ్ కుమారుడు చిరంజీవ్ రావును అనుష్క రావు వివాహం చేసుకున్నారు.
చందా సింగ్ (కూతురు)
లా డిగ్రీ పొందిన చందా సింగ్.. పైలట్ విక్రమ్ సింగ్ను పెళ్లి చేసుకున్నారు. చందా సింగ్ రాజకీయాలకు దూరంగా ఉంటారు.
రాగిణి యాదవ్ (కుమార్తె)
సమాజ్వాదీ పార్టీతో సంబంధం ఉన్న రాహుల్ సింగ్ను రాగిణి యాదవ్ వివాహం చేసుకున్నారు.
హేమా యాదవ్ (కూతురు)
హేమా యాదవ్ బీటెక్ పూర్తి చేశారు. తేజ్ యాదవ్ను వివాహం చేసుకున్న హేమా యాదవ్.. ప్రజా జీవితంలో కనిపించరు.
మరోవైపు.. ఎన్నికల ఫలితాల తర్వాత లాలూ కుటుంబంలో రోహిణి ఆచార్య వివాదం నేపథ్యంలో ఆయన మరో ముగ్గురు కుమార్తెలు రాజ్ లక్ష్మి, రాగిణి యాదవ్, చందా సింగ్లు కూడా ఆదివారం రోజున పాట్నాలోని లాలూ ఇంటి నుంచి ఢిల్లీకి వెళ్లిపోయారు. ఇక తేజస్వీ యాదవ్ సారథ్యంలోనే ఎన్నికల్లోకి వెళ్లిన ఆర్జేడీ.. కుటుంబంలో తలెత్తిన ఈ అంతర్గత కలహాల నేపథ్యంలో రాబోయే రోజుల్లో బిహార్లో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa