ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించిన యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ పథకాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి పౌరుడికీ నాణ్యమైన, నగదు రహిత వైద్య సేవలు అందేలా చూడడమే లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ పేరుతో అమలవుతున్న పథకాన్ని మరింత విస్తృతంగా, సార్వత్రికంగా మార్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం అమలులో ఉన్న డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ (ఆరోగ్యశ్రీ) కింద ఏ ప్రాంతంలో, ఏ వ్యాధికి ఎంత ఖర్చు అవుతోంది అనే వివరాలను పూర్తిగా విశ్లేషించాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. గత అనుభవాలు, ఖర్చుల నమూనా, లబ్ధిదారుల సంఖ్య ఆధారంగా కొత్త పథకాన్ని మరింత పకడ్బందీగా రూపొందించేందుకు ఈ విశ్లేషణ కీలకమని అధికార వర్గాలు చెబుతున్నాయి.
కొత్త యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ పథకం అమలులోకి వచ్చాక రాష్ట్రంలోని మొత్తం 1.63 కోట్ల కుటుంబాలకు ఏడాదికి రూ.2.5 లక్షల వరకు పూర్తి నగదు రహిత వైద్య సౌకర్యం లభిస్తుంది. అందులో 1.43 కోట్ల బీపీఎల్ (దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న) కుటుంబాలకు మాత్రమే ఏడాదికి రూ.25 లక్షల వరకు పూర్తిగా ఉచిత చికిత్స అందనుంది. మిగిలిన కుటుంబాలకు రూ.2.5 లక్షల వరకు కవరేజీ ఉంటుంది.
ఈ పథకం అమలుతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యంత విస్తృతమైన, ప్రజలందరికీ చేరే ఆరోగ్య భద్రతా విధానాన్ని కలిగిన రాష్ట్రంగా అవతరించనుంది. “ఒక్కరూ వైద్య ఖర్చు భారంతో ఇబ్బంది పడకూడదు” అన్నదే చంద్రబాబు లక్ష్యమని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. రాబోయే నెలల్లో ఈ పథకం అమలు రూపు రేఖలు మరింత స్పష్టమవుతాయని అంచనా వేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa