పాకిస్తాన్ తన రక్షణ, టెక్నాలజీ సామర్థ్యాలను పెంచుకోవడంలో భాగంగా కీలక విజయాన్ని అందుకుంది. పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేసిన.. యాంటీ షిప్ బాలిస్టిక్ క్షిపణిని పాకిస్తాన్ నేవీ విజయవంతంగా పరీక్షించినట్లు ఆ దేశ సైన్యం వెల్లడించింది. పాకిస్తాన్ సైనిక మీడియా విభాగం ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ విడుదల చేసిన ఒక ప్రకటనలో.. ఈ బాలిస్టిక్ మిసైల్ పరీక్షను మంగళవారం రోజున స్థానికంగా తయారు చేసిన నావికాదళ ప్లాట్ఫారమ్ నుంతచి నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇది పాకిస్తాన్ దేశ రక్షణ సామర్థ్యాలను మరింత పెంచుతుందని పాక్ నేవీ తెలిపింది.
ఈ కొత్త క్షిపణి అత్యంత అధునాతన గైడెన్స్ సిస్టమ్లను కలిగి ఉందని పాక్ వర్గాలు తెలిపాయి. ఇది సముద్రంలో ఉన్న లక్ష్యాలతో పాటు.. భూమిపై ఉన్న లక్ష్యాలను కూడా అధిక కచ్చితత్వంతో ఛేదించడానికి తయారు చేసినట్లు పేర్కొన్నాయి. మెరుగైన విన్యాస సామర్థ్యం దీని ప్రత్యేకత అని వెల్లడించాయి. ఈ విజయవంతమైన ప్రయోగం పాకిస్తాన్ రోజురోజుకూ పెంచుకుంటున్న టెక్నికల్ స్కిల్స్, జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడంలో పాక్ నేవీ నిబద్ధతను చాటుతోందని పాకిస్తాన్ నేవీ ప్రతినిధి పేర్కొన్నారు.
ఈ ఏడాది మే నెలలో భారత్తో జరిగిన ఆపరేషన్ సిందూర్ తర్వాత.. పాకిస్తాన్ తన రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే ఈ ఏడాది సెప్టెంబర్లో.. పాకిస్తాన్ ఆర్మీ 750 కిలోమీటర్ల పరిధి గల భూమి నుంచి ప్రయోగించే క్రూయిజ్ క్షిపణి 'ఫతా-4'ను కూడా టెస్ట్ చేసింది. ఫతా-4 మిసైల్ అధునాతన ఏవియానిక్స్, నావిగేషనల్ వ్యవస్థలను కలిగి ఉందని.. ఇది భూమికి దగ్గరగా తక్కువ ఎత్తులో ప్రయాణించడం ద్వారా క్షిపణి రక్షణ వ్యవస్థలను సమర్థవంతంగా తప్పించుకోగలదని పాక్ సైన్యం తెలిపింది. ఇక ఈ యాంటీ షిప్ బాలిస్టిక్ మిసైల్ ప్రయోగం విజయం సాధించడంపై పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ.. ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ సహా సైనిక ఉన్నతాధికారులు ఈ ప్రాజెక్ట్లో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలు, ఇంజనీర్లపై ప్రశంసల జల్లు కురిపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa