ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.100 కోట్ల అవినీతి సామ్రాజ్యం.... ఏసీబీకి దొరికిన ల్యాండ్ రికార్డ్స్ ఏడీ

Crime |  Suryaa Desk  | Published : Fri, Dec 05, 2025, 08:54 PM

తెలంగాణలో ఏసీబీ సిబ్బంది.. మరో అవినీతి అధికారిని అరెస్ట్ చేశారు. ల్యాండ్ రికార్డ్స్ ఏడీగా విధులు నిర్వహిస్తోన్న సదరు ఉద్యోగి ఏకంగా 3 రాష్ట్రాల్లో అక్రమాస్తులను కూడబెట్టుకుని.. రూ.100 కోట్ల మేర సంపాదించాడు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనివాసులు.. రంగారెడ్డి జిల్లా సర్వే సెటిల్‌మెంట్‌ అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులకు సమాచారం అందడంతో.. వారు సోదాలు నిర్వహించారు.


దీనిలో భాగంగా ఏసీబీ అధికారులు గురువారం నాడు హైదరాబాద్‌ రాయదుర్గంలోని మైహోం భుజా కమ్యూనిటీలో నివాసం ఉంటున్న శ్రీనివాసులు ఇంట్లో సోదాలు జరిపారు. అలానే మహబూబ్‌నగర్, హైదరాబాద్, నారాయణపేట జిల్లాల్లో ఉన్న శ్రీనివాసులు బంధువులు, బినామీల ఇళ్లతో పాటుగా.. మొత్తం 7 ప్రాంతాల్లో గురువారం తెల్లవారుజాము నుంచే ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.


శ్రీనివాసులు విధులు నిర్వహిస్తోన్న రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లోని ఆయన ఆఫీసులో కూడా ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. ఈక్రమంలో ఆయన అక్రమార్జనకు సంబంధించిన కీలక పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో.. రూ.కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, నగదు, కార్లు, వ్యవసాయ భూములతో పాటు ప్లాట్లను కూడా గుర్తించారు. వీటికి సంబంధించిన లెక్కలు చూపడంలో శ్రీనివాసులు విఫలం కావడతో.. ఏసీబీ అధికారులు వాటిని స్వాధీనం చేసుకుని.. ఆయన మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.


శ్రీనివాసులు తన సర్వీసులో అధిక భాగం.. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లోనే విధులు నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రారంభంలో శ్రీనివాసులు.. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో సర్వేయర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత అక్కడే డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌గా పని చేశారు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తూనే.. మేడ్చల్‌-మల్కాజిగిరికి ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు.


అక్రమార్జనకు అలవాటు పడ్డ శ్రీనివాసులు.. సర్వే నంబర్లను మార్చడం, తప్పుడు సర్వే నివేదికలతో సర్కార్ ల్యాండ్స్‌ను ప్రైవేటు పరం చేసి భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే గతంలో హైడ్రాకు తప్పుడు సమాచారం ఇవ్వడంతో శ్రీనివాసులు మీద క్రిమినల్‌ కేసు కూడా నమోదై ఉంది.


ఈ తనిఖీల్లో అధికారులు స్వాధీనం చేసుకున్న ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి.


770 గ్రాముల వెండి వస్తువులతో పాటుగా 1.6 కేజీల బంగారు ఆభరణాలు,


5 లక్షల రూపాయల నగదు.


కియా సెల్టోస్, ఇన్నోవా హైక్రాస్ కార్లు,


నారాయణపేటలో 3, మహబూబ్‌నగర్‌ జిల్లాలో 4 చొప్పున ప్లాట్లు


నారాయణపేట జిల్లాలోని కృష్ణా మండలంలో రైస్ మిల్లుతో పాటు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌,


ఏపీ, అనంతపురం జిల్లాలో 11, కర్ణాటకలో 11 ఎకరాల వ్యవసాయ భూములు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa