రాష్ట్రంలో రెవెన్యూ సేవలు మరింత సులభతరం కావాలని, ప్రజలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా వ్యవస్థ పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.పట్టాదారు పాస్ పుస్తకాలతో సహా భూ సంబంధిత అన్ని సేవల్లో రియల్ టైమ్ ఆటో మ్యూటేషన్ను తప్పనిసరిగా అమలు చేయాలి అని సీఎం దృష్టి సారించారు. రిజిస్ట్రేషన్ పూర్తయ్యిన వెంటనే ఆటోమ్యూటేషన్ జరుగేలా వ్యవస్థను మార్చాలని ఆయన సూచించారు. భూ యజమానులు పట్టాదారు పాస్ పుస్తకాలు కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఇక ఉండకూడదని, రెవెన్యూ శాఖలో వచ్చే ఏడాదిలోపే సంపూర్ణ మార్పులు తీసుకురావాలని కీలక సూచనలు చేశారు. ఈ ప్రక్రియపై ప్రతినెలా సమీక్షిస్తానని కూడా స్పష్టం చేశారు.సచివాలయంలో జరిగిన ఈ సమావేశానికి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, సీసీఎల్ఏ అధికారులు హాజరయ్యారు. పీజీఆర్ఎస్లో మ్యూటేషన్, పట్టాదారు పాస్ పుస్తకాలపై మొత్తం 1,97,915 ఫిర్యాదులు అందాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. ల్యాండ్ నేచర్, క్లాసిఫికేషన్కు సంబంధించిన 1,00,835, రీసర్వే తర్వాత భూమి తగ్గిందని వచ్చిన దరఖాస్తులు 1,00,295, జాయింట్ ఎల్పీఎంల సమస్యలపై 2,40,479 ఫిర్యాదులు నమోదైనట్లు వివరించారు.రీసర్వే పురోగతిపై ప్రతినెలా రిపోర్ట్ తప్పనిసరి ప్రస్తుతం 6,693 గ్రామాల్లో రీసర్వే పూర్తయ్యిందని, ఇంకా 10,123 గ్రామాల్లో పనులు మిగిలి ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ రీసర్వే ప్రాజెక్టును 2027 డిసెంబరు నాటికి పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. రీసర్వే పురోగతిపై ప్రతి నెలా నివేదిక సమర్పించాలని స్పష్టంగా చెప్పారు.జాయింట్ ల్యాండ్ పార్సెల్ మ్యాప్స్కు సంబంధించిన వివాదాలను త్వరగా పరిష్కరించాలని, భూమి వివరాలు పూర్తిగా ఆన్లైన్లో అందుబాటులో ఉంటే ఈసీ జారీ ప్రక్రియ చాలా సులభమవుతుందని ముఖ్యమంత్రి భావించారు. 22ఏ జాబితా నుంచి తొలగించాలని వచ్చిన దరఖాస్తులను తక్షణమే పరిశీలించాలన్నారు. 22ఏ ఫ్రీహోల్డ్ భూముల విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని కూడా అధికారులకు సూచించారు.భూముల వివరాలను ఎవరు ట్యాంపర్ చేయలేని విధంగా బ్లాక్చెయిన్ వంటి పటిష్ట సిస్టమ్ను తీసుకురావాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అన్నారు. భూమి సమాచారం పారదర్శకంగా ఆన్లైన్లో ఉంచితే వివాదాలు తగ్గుతాయని చెప్పారు.ఇన్నాళ్లుగా జాయింట్ కలెక్టర్ పరిధిలో ఉన్న డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ సమస్యలను ఇకపై ఆర్డీవో స్థాయి వద్దే పరిష్కరించేలా అధికార బదిలీ చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. చుక్కల భూములను 22ఏ జాబితా నుంచి తొలగించే ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పారు. అలాగే 1999 వరకు ప్రాథమిక సహకార సంఘాల వద్ద తాకట్టు పెట్టిన అసైన్డ్ భూములు, అలాగే 1954కి ముందున్న బంజరు భూముల సేల్ డీడ్స్ వివరాలు కూడా 22ఏ జాబితా నుంచి తొలగించాలని ఆయన ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa