ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ కీలక మార్పునకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి, ఏడుసార్లు ఎంపీ అయిన పంకజ్ చౌదరీని ఉత్తర ప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉంది. 2027 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, నాన్-యాదవ్ ఓబీసీ వర్గాన్ని ఏకీకృతం చేసే వ్యూహంలో భాగంగానే ఈ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
అధ్యక్ష పదవి రేసులో చౌదరీ..
పంకజ్ చౌదరీ ఆదివారం లక్నోలో బీజేపీ యూపీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు ముందుగా ఆయన నేడు నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, బీజేపీ జాతీయ కార్యదర్శి వినోద్ తవాడే హాజరు కానున్నారు. గతంలో సంతోష్ గంగ్వార్ గవర్నర్గా నియమితులైన తర్వాత.. యూపీ బీజేపీ అధ్యక్ష పదవి రేసులో పంకజ్ చౌదరీ ప్రముఖంగా నిలిచారు. 2027 అసెంబ్లీ ఎన్నికల్లో ఓబీసీ నేతను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం ద్వారా యాదవేతర ఓబీసీ ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకోవాలని బీజేపీ యోచిస్తోంది.
పంకజ్ చౌదరీ నేపథ్యమిది..!
మహారాజ్గంజ్ నియోజకవర్గం నుంచి ఏడు సార్లు ఎంపీగా గెలిచిన పంకజ్ చౌదరీకి బలమైన రాజకీయ నేపథ్యం ఉంది. ఆయన తల్లి ఉజ్వల్ చౌదరీ గతంలో మహారాజ్గంజ్ జిల్లా పంచాయతీ అధ్యక్షురాలిగా పనిచేశారు. అయితే ఈయన గోరఖ్పూర్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1989 నుంచి 1991 మధ్య గోరఖ్పూర్ మున్సిపల్ కార్పొరేషన్లో సభ్యుడిగా పని చేశారు. 1990 నుంచి బీజేపీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండో కేబినెట్లో ఆయన ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
అయితే పంకజ్ చౌదరీ కుర్మీ వర్గానికి చెందినవారు. ఉత్తర ప్రదేశ్లో ఓబీసీ కేటగిరీలో కుర్మీలు యాదవుల తర్వాత రెండో అతిపెద్ద ఓటు బ్యాంకుగా ఉన్నారు. రాష్ట్రంలో 8 నుంచి 10 శాతం వరకు కుర్మీ ఓటర్లు ఉండగా.. వారి ప్రభావం సుమారు 30 నుంచి 40 అసెంబ్లీ సీట్లపై ఉంటుంది. ప్రధానంగా తెరాయి, కాశీ, గోరఖ్పూర్, అవధ్, రోహిల్ఖండ్ ప్రాంతాల్లో ఈ వర్గం బలంగా ఉంది. కుర్మీ వర్గానికి చెందిన చౌదరీకి పార్టీ పగ్గాలు అప్పగించడం ద్వారా కీలక ప్రాంతాల్లోని నాన్-యాదవ్ ఓబీసీ ఓట్లను తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ వ్యూహం పన్నుతోంది. చౌదరీ నియామకంతో పాటు ప్రాంతీయ సమతుల్యతను పాటించేందుకు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కూడా జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa