ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఒక్కటి తాగడం వల్ల కాలుష్యమేమీ పెరిగిపోదు': లోక్‌భలో సిగరెట్ తాగిన ఎంపీ సౌగతా రాయ్ సమర్థింపులు

national |  Suryaa Desk  | Published : Sat, Dec 13, 2025, 08:28 PM

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఇప్పటికే పలు విషయాల్లో వాడీవేడీగా కొనసాగుతున్న నేపథ్యంలో.. తాజాగా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సీనియర్ ఎంపీ సౌగతా రాయ్ పార్లమెంట్ ఆవరణలో సిగరెట్ తాగుతూ కెమెరా కంటికి చిక్కడం పెద్ద దుమారాన్ని రేకెత్తించింది. ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. బీజేపీ నాయకులు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే దీనిపై సౌగతా రాయ్ ఘాటుగా స్పందిస్తూ.. కావాలనే దీన్ని పెద్ద రచ్చ చేస్తున్నారని అన్నారు.


ప్రజారోగ్యం, సభ గౌరవంపై తీవ్ర ప్రభావం..


శుక్రవారం రోజు ఉదయం పార్లమెంట్ ప్రాంగణంలో సౌగతా రాయ్ ధూమపానం చేస్తుండగా ఆయన పక్కనే ఉన్న కేంద్ర మంత్రులు గిరిరాజ్ సింగ్, గజేంద్ర సింగ్ షెకావత్ ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజారోగ్యంపై, సభ గౌరవంపై దీని ప్రభావం ఉంటుందని హెచ్చరించారు. ముఖ్యంగా షెకావత్.. "మీరు ప్రజారోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నారు" అని రాయ్‌తో అన్నట్లు సమాచారం. అయితే బీజేపీ ఆరోపణలపై సౌగతా రాయ్ తీవ్రంగా స్పందించారు. "ఇది ఎలాంటి ఆరోపణ కాదు. సభ లోపల సిగరెట్ తాగడం నిషేధం. కానీ బయట బహిరంగ ప్రదేశంలో ధూమపానంపై ఎలాంటి అభ్యంతరం లేదు" అని ఆయన స్పష్టం చేశారు.


అనంతరం ఈ వివాదాన్ని మళ్లించిన ఆయన.. బీజేపీ ప్రభుత్వం హయాంలో ఢిల్లీలో కాలుష్యం గరిష్ఠ స్థాయికి చేరిందని అన్నారు. ముందు దానిపై దృష్టి పెట్టాలని సూచించారు. అనవసరమైన ఆరోపణలు చేయడం మానుకోవాలని ఎదురుదాడికి దిగారు. ఒక్క సిగరెట్ తాగితే ఏమీ మారిపోదని.. కాలుష్యం పెరిగిపోదని ఎద్దేవా చేశారు. ఈ వివాదం మరింత ముదరడానికి.. అంతకుముందు రోజు లోక్‌సభలో జరిగిన మరో ఘటనే కారణమైంది. బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్.. టీఎంసీ సభ్యుడు ఒకరు సభ లోపల నిషేధిత ఈ-సిగరెట్(వేపింగ్) ఉపయోగిస్తున్నారని, దీనిపై స్పీకర్ ఓం బిర్లా దృష్టి సారించాలని కోరారు. "ఈ-సిగరెట్‌లను దేశంలో నిషేధించినప్పుడు, సభలో వాటిని అనుమతించారా?" అని ఠాకూర్ ప్రశ్నించారు.


దీనిపై స్పందించిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా.. సభ లోపల ఎలాంటి ధూమపానానికి అనుమతించబోమని స్పష్టం చేశారు. ఈ ఉల్లంఘనపై లిఖితపూర్వక ఆధారాలు సమర్పిస్తే.. సంబంధిత ఎంపీపై కఠిన చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. కాగా ఎలక్ట్రానిక్ సిగరెట్ల (నిషేధిత) చట్టం 2019 ప్రకారం.. వీటి తయారీ, విక్రయం, నిల్వ, ప్రకటనలు చేయడం భారత్‌లో పూర్తిగా చట్టవిరుద్ధం అని వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa