రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే సంస్థలకు భూముల కొరత రాకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అమరావతిలో జరుగుతున్న జిల్లా కలెక్టర్ల సమావేశంలో భాగంగా పారిశ్రామిక పెట్టుబడులపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా, ఏపీఐఐసీకి చెందిన సుమారు 82 వేల ఎకరాల భూమి 22ఏ పరిధిలో ఉండటం వల్ల పెట్టుబడులకు ఆటంకంగా మారిందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు.దీనిపై తక్షణం స్పందించిన ముఖ్యమంత్రి, ఆ 82 వేల ఎకరాల భూమికి సంబంధించిన సాంకేతిక అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఎలాంటి చట్టపరమైన, సాంకేతిక ఇబ్బందులు లేకపోతే, ఆ భూములను 22ఏ పరిధి నుంచి తప్పించేందుకు కేబినెట్ సమావేశానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. భూ కేటాయింపుల్లో పర్యాటక రంగానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని, ఆ తర్వాత ఐటీ కంపెనీలకు కేటాయించాలని చంద్రబాబు సూచించారు.గత 18 నెలల్లో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి రూ.8.55 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు ఆమోదం తెలిపామని, కొన్ని ప్రాజెక్టులు ఇప్పటికే నిర్మాణ పనులు కూడా ప్రారంభించాయని ముఖ్యమంత్రి తెలిపారు. భూ కేటాయింపుల్లో కలెక్టర్లు చొరవ చూపి ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. విజయవాడ, విశాఖపట్నంలలో భూ వివాదాల పరిష్కారానికి ప్రత్యేక ట్రైబ్యునల్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.సౌర, పవన, పంప్డ్ స్టోరేజీ వంటి పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు భూ కేటాయింపులు త్వరగా పూర్తి చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు. విశాఖ, తిరుపతి, అమరావతి వంటి ప్రాంతాల్లో ప్రముఖ విద్యా సంస్థల ఏర్పాటుకు కృషి చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లు, టూరిజం ప్రాజెక్టులను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని కలెక్టర్లకు సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa