ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రంప్ కొత్త రూల్స్.. టీసీఎస్, ఇన్ఫోసిస్ సహా భారత ఐటీ కంపెనీలకు భారీ షాక్

international |  Suryaa Desk  | Published : Wed, Dec 17, 2025, 10:20 PM

హెచ్-1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ వంటి భారతీయ ఐటీ ఔట్‌సోర్సింగ్, స్టాఫింగ్ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ ఫీజు నిబంధన నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి అతిపెద్ద అడ్డంకిగా మారింది. బ్లూమ్‌బెర్గ్ న్యూస్ విశ్లేషణ ప్రకారం.. ఈ కొత్త విధానం వల్ల TCS, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ వంటి బహుళజాతి కంపెనీలు భారీగా నష్టపోతాయి. మే 2020 నుంచి మే 2024 మధ్య కాలంలో ఈ మూడు కంపెనీలు కొత్తగా నియమించుకున్న H-1B ఉద్యోగులలో దాదాపు 90% మందికి ఈ ఫీజు వర్తిస్తుంది.


 ఉదాహరణకు ఇన్ఫోసిస్ నియమించుకున్న 10,400 మందికి పైగా ఉద్యోగులకు హెచ్ 1బీ వీసా ఫీజు లక్ష డాలర్ల నిబంధన వర్తిస్తే, కంపెనీకి బిలియన్ డాలర్లకు పైగా అదనపు ఖర్చు అవుతుంది. టీసీఎస్ 6,500 మందికి, కాగ్నిజెంట్ 5,600 మందికి ఫీజు చెల్లించాల్సి వస్తుంది. ఫీజు అమలులో చట్టపరమైన సవాళ్లు ఉన్నప్పటికీ, వీసా డిమాండ్ గణనీయంగా తగ్గుతుందని, మరిన్ని ఉద్యోగాలు విదేశాలకు తరలిపోతాయని ఐటీ పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. ‘అసాధారణ ప్రతిభ కలిగిన విదేశీయులు అవకాశాలను కోల్పోతారనే భయం ఉంది’ అని ఐటీ కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇమ్మిగ్రేషన్ అటార్నీ జోనాథన్ వాస్డెన్ అన్నారు.


కొన్ని కంపెనీలు మాత్రం ఈ ఫీజు తమ కార్యకలాపాలపై స్వల్పకాలంలో పెద్దగా ప్రభావం చూపదని చెబుతున్నాయి. ‘గత కొన్నేళ్లుగా మేము వీసాలపై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గించాం.. కేవలం కొన్ని ప్రత్యేక సాంకేతిక ఉద్యోగాలకు మాత్రమే వీటిని ఉపయోగిస్తున్నాం’ అని కాగ్నిజెంట్ ప్రతినిధి జెఫ్ డెమర్రాయిస్ తెలిపారు.


సాధారణంగా, H-1B వీసా ప్రోగ్రామ్ ద్వారానే విదేశీయులు అమెరికాలో ఉద్యోగాలు పొందుతారు. ఏటా అందుబాటులో ఉండే 85,000 వీసా స్లాట్లలో ఎక్కువ భాగం పెద్ద టెక్, ఐటీ కంపెనీలే పొందుతాయి. స్థానికులకు బదులుగా చౌకగా విదేశీయులను నియమించుకోవడానికి ఈ ప్రోగ్రామ్‌ను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అయితే, నిబంధనలు మార్పుతో H-1B ఉద్యోగులకు వారి శ్రమకు తగిన వేతనం చెల్లించాల్సి ఉంటుంది.


మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ట్రంప్ 2020లో ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ లాటరీ ప్రక్రియను ఐటీ కంపెనీలు ఉపయోగించుకున్నాయి. దీని ద్వారా తక్కువ రుసుంతోనే H-1B ఉద్యోగులను నమోదు చేసుకునేవారు. దీనివల్ల దరఖాస్తుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఈ లాటరీని దుర్వినియోగం చేస్తున్నారని, వేతనాలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని బైడెన్ యంత్రాంగం అప్పట్లో ఆరోపించింది. ట్రంప్ తాజాగా తీసుకొచ్చిన లక్ష డాలర్లు ఫీజు అలాంటి కంపెనీలను ఈ ప్రోగ్రామ్ నుండి నిరోధించడానికి మరింత కఠిన చర్య.


‘అమెరికా వ్యాపారాలకు అధిక-నైపుణ్యం కలిగిన కార్మికులను పొందడంలో మరింత భరోసా ఇవ్వడానికి, వ్యవస్థను దుర్వినియోగం చేసి వేతనాలను తగ్గించే కంపెనీలను అడ్డుకోడానికి ఇది సహాయపడుతుంది’ అని వైట్‌హౌస్ ప్రతినిధి టేలర్ రోజర్స్ తెలిపారు. అయితే, వీసా ఫీజు పెంపు నిర్ణయాన్ని అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ వంటి వ్యాపార సంఘాలు కోర్టుల్లో సవాల్ చేయగా.. కేసుపై విచారణ జరగనుంది. చాలా కంపెనీలు న్యాయస్థానాల తీర్పు కోసం వేచి చూడకుండానే తమ నియామక ప్రణాళికలను మార్చుకుంటున్నాయి. ‘‘ప్రపంచంలోని అత్యుత్తమ ప్రతిభను పొందాలంటే, ఆ ప్రతిభ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్లాలి’’ టెక్ రిసెర్చ్ సంస్థ ISG చీఫ్ AI ఆఫీసర్ స్టీవ్ హాల్ అన్నారు. దీనివల్ల అమెరికా కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెంచే అవకాశం ఉంది.


ఈ ఫీజు పెంపు సరైన నిర్ణయమని, కానీ కంపెనీలు దీనికి కూడా పరిష్కారాలు కనుగొంటాయని కొందరు అంటున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో జరిగే వీసా లాటరీ, ఈ ఫీజు ఎంతవరకు విజయవంతమైందో తెలియజేస్తుంది. ‘అధిక నైపుణ్యం, అధిక వేతనం కలిగిన ఉద్యోగులు వస్తారా? అదే మొదటి సంకేతం’ అని H-1B ప్రోగ్రామ్‌ను విమర్శించే హోవార్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాన్ హిరా అన్నారు.


కొత్త ఖర్చులు, లాటరీ నిబంధనలలో మార్పుల వల్ల వచ్చే ఏడాది లాటరీ దరఖాస్తులు 30% నుంచి 50% వరకు తగ్గుతాయని అంచనా. ‘ట్రంప్ యంత్రాంగం లక్ష డాలర్లు రుసుము, వెయిటెడ్ లాటరీ నిబంధనలతో కలిసి H-1B లాటరీకి సంబంధించి మార్కెట్ ప్రవర్తనను మార్చే కొత్త ప్రోత్సాహకాలను సృష్టించింది’" అని లీగల్ టెక్ స్టార్టప్ లాఫుల్లీ డైరెక్టర్ ఫిన్ రేనాల్డ్స్ తెలిపారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa