ఢిల్లీలో వాహనదారులకు భారీ ఊరటనిచ్చే వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడంతో వాహనాలపై విధించిన జరిమానాలను కట్టకుండా ఉన్న పెండింగ్ చలాన్లను పూర్తిగా రద్దు చేసే దిశగా ఢిల్లీలోని రేఖా గుప్తా నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు, ఎన్ఫోర్స్మెంట్ విభాగం జారీ చేసిన అన్ని రకాల పెండింగ్ చలాన్లను రద్దు చేయాలని ఢిల్లీ ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ మేరకు ఒక అమ్నెస్టీ (క్షమాభిక్ష) పథకాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఫైల్ను ఇప్పటికే లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా (వీకే సక్సేనా) ఆమోదం కోసం పంపించింది.
ఈ నిర్ణయానికి ఎల్జీ వీకే సక్సేనా ఆమోదం తెలిపిన వెంటనే.. సీఎం రేఖా గుప్తా నేతృత్వంలోని ఢిల్లీ కేబినెట్ దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు.. వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు పీయూసీ (పొల్యూషన్ సర్టిఫికెట్) లేని వాహనాలపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఢిల్లీలో లక్షలాదిగా పేరుకుపోయిన ట్రాఫిక్ చలాన్ల భారం నుంచి.. వాహనదారులను బయటపడేసేందుకు రేఖా గుప్తా ప్రభుత్వం ఈ భారీ ఊరటను ప్రకటించేందుకు రెడీ అయింది.
ఇప్పటివరకు ట్రాఫిక్ పోలీసులు, రవాణా శాఖ ఎన్ఫోర్స్మెంట్ విభాగాలు జారీ చేసిన అన్ని చలాన్లను రద్దు చేయాలని.. ఢిల్లీ ప్రభుత్వం భావిస్తోంది. కోర్టుల్లో కేసుల భారాన్ని తగ్గించడంతో పాటు.. సామాన్యులకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించడమే ఈ ఆమ్నెస్టీ పథకం ముఖ్య ఉద్దేశ్యమని ఢిల్లీ ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఒకవైపు ఢిల్లీ పరిధిలో ట్రాఫిక్ చలాన్లు మాఫీ చేయాలనే ప్రతిపాదన ఉన్నప్పటికీ.. పర్యావరణ నిబంధనల విషయంలో మాత్రం రేఖా గుప్తా ప్రభుత్వం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. పొల్యుషన్ సర్టిఫికెట్లు లేని వాహనాలపై భారీగా ఫైన్లు విధిస్తున్నారు. ఈ క్రమంలోనే గత 2 నెలల్లోనే సుమారు 1.56 లక్షల చలాన్లను అధికారులు జారీ చేశారు. 2023లో 2.32 లక్షలుగా ఉన్న పొల్యూషన్ చలాన్లు.. 2025 డిసెంబర్ నాటికి 8.22 లక్షలకు పెరగడం గమనార్హం. నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు రూ.10 వేల వరకు ఫైన్లు విధిస్తున్నారు.
ఢిల్లీలో కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం కొత్త వ్యూహాలను అమలు చేస్తోంది. ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ (డీపీసీసీ) అధికారులు పెట్రోల్ పంపుల వద్ద కెమెరాలను ఏర్పాటు చేసి మరీ వాహనాల పొల్యూషన్ స్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మొదటిసారి నిబంధనలు ఉల్లంఘించిన వారికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయినప్పటికీ వారు పదేపదే తప్పు చేస్తే భారీ మొత్తంలో చలాన్లు విధిస్తున్నారు. అంబులెన్సులు, ఎమర్జెన్సీ సర్వీస్ వాహనాలకు మాత్రం ఈ జరిమానాల నుంచి మినహాయింపును ఇచ్చారు. డిసెంబర్ 17వ తేదీ నుంచి.. 19వ తేదీ వరకు కేవలం 3 రోజుల్లోనే సుమారు 2,700కు పైగా చలాన్లను జారీ చేశారు. ఢిల్లీలో కాలుష్యం దృష్ట్యా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గడువు ముగిసిన వాహనాలను రోడ్లపైకి రాకుండా అధికారులు కట్టుదిట్టంగా తనిఖీలు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa