ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బంగ్లాకు భారత్ 210 టన్నుల ఉల్లి

international |  Suryaa Desk  | Published : Tue, Dec 23, 2025, 10:32 PM

పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం వింత పరిస్థితి నెలకొంది. రాజకీయంగా భారత్‌కు వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు, దాడులు జరుగుతున్నప్పటికీ.. సామాన్యుడి ఆకలి తీర్చడానికి మాత్రం మళ్లీ భారత ఉత్పత్తులే దిక్కవుతున్నాయి. ఇంక్విలాబ్ మంచ్ కన్వీనర్ ఉస్మాన్ హాదీ మృతి తర్వాత బంగ్లాదేశ్‌లో 'యాంటీ ఇండియా' సెంటిమెంట్ పతాక స్థాయికి చేరింది. భారత రాయబార కార్యాలయాలు, దౌత్య నివాసాలపై దాడులు జరుగుతున్న ఈ ఉద్రిక్త సమయాన.. భారత్ నుంచి భారీగా ఉల్లి దిగుమతులు ప్రారంభం కావడం గమనార్హం.


మూడు రోజుల్లో 210 మెట్రిక్ టన్నుల దిగుమతి


గత కొద్ది రోజులుగా బంగ్లాదేశ్‌లో ఉల్లి ధరలు ఆకాశాన్ని తాకాయి. నిత్యావసర మార్కెట్‌లో కిలో ఉల్లి ధర 100 టాకాలకు (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.74)పైగా పలకడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ విషయం గుర్తించిన ప్రభుత్వం సామాన్యుక సమస్య తీర్చేందుకు మళ్లీ భారత్ వైపు మొగ్గు చూపక తప్పలేదు. బెనాపోల్ ల్యాండ్ పోర్ట్ ద్వారా గత మూడు రోజులుగా భారత్ నుంచి ఉల్లి లోడుతో వస్తున్న ట్రక్కులు బారులు తీరుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. డిసెంబర్ 20వ తేదీ అంటే శనివారం రోజు సాయంత్రం 90 మెట్రిక్ టన్నుల ఉల్లి గూడ్స్ బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించాయి. అలాగే సోమవారం రోజు మరో మూడు ట్రక్కుల్లో 90 మెట్రిక్ టన్నులు వెళ్లాయి. ఇక బుధవారం రోజు 1 ట్రక్కులో 30 మెట్రిక్ టన్నుల ఉల్లిని తరలించారు.


ఇలా మొత్తంగా.. గత మూడు రోజుల్లో 7 ట్రక్కుల ద్వారా 210 మెట్రిక్ టన్నుల ఉల్లిపాయలు దిగుమతి అయ్యాయని బెనాపోల్ పోర్ట్ డైరెక్టర్ షమీమ్ హుస్సేన్ వెల్లడించారు. సెప్టెంబర్ తర్వాత మళ్లీ ఇంత భారీ స్థాయిలో దిగుమతులు జరగడం ఇదే తొలిసారి. భారత ఉల్లి మార్కెట్లోకి వెళ్లగానే.. బంగ్లాదేశ్‌లో ధరలు ఒక్కసారిగా కిందికి దిగి వచ్చాయి. కిలోకు 10 నుంచి 15 టాకాల వరకు తగ్గి.. ప్రస్తుతం కిలో ఉల్లి ధర 42 నుంచి 43 టాకాలు (భారత కరెన్సీ ప్రకాసం సుమారు రూ.30)కే లభిస్తోంది.


ఉస్మాన్ హాదీ మృతి వెనుక భారత కుట్ర ఉందంటూ బంగ్లాలో జరుగుతున్న ప్రచారం వల్ల భారత రాయబార కార్యాలయాల వద్ద గందరగోళం నెలకొంది. ఇలాంటి భయానక పరిస్థితుల్లో కూడా వాణిజ్య సంబంధాలు కొనసాగడం విశేషం. ప్రస్తుతం భారత్‌లోని పెట్రాపోల్ పోర్ట్ వద్ద మరిన్ని ఉల్లి ట్రక్కులు బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాయని.. త్వరలోనే అవి కూడా మార్కెట్లోకి వస్తాయని అధికారులు తెలిపారు. భారత్ వ్యతిరేక సెంటిమెంట్ బలంగా ఉన్నప్పటికీ.. ఆహార భద్రత విషయంలో మాత్రం బంగ్లాదేశ్‌కు భారతే అండగా నిలుస్తోందని ఈ దిగుమతులు స్పష్టం చేస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa