గత కొద్ది రోజులుగా భారత్-బంగ్లాదేశ్ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పొరుగు దేశమైన భారత్తో సంబంధాలు చేజారిపోకుండా చూస్తామని.. ఆర్థిక స్థిరత్వం కోసం ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేస్తామని బంగ్లాదేశ్ ఆర్థిక సలహాదారు సలేహుద్దీన్ అహ్మద్ స్పష్టం చేశారు. మంగళవారం జరిగిన ప్రభుత్వ కొనుగోళ్ల సలహా కమిటీ సమావేశం అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
వ్యక్తిగతంగా రంగంలోకి మహమ్మద్ యూనస్
భారత్ వంటి పెద్ద దేశంతో శత్రుత్వం వహించడం తమ ప్రభుత్వానికి ఇష్టం లేదని అహ్మద్ పేర్కొన్నారు. "ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించి.. న్యూఢిల్లీతో సత్సంబంధాలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ స్వయంగా కృషి చేస్తున్నారు" అని ఆయన వెల్లడించారు. ఇటీవల కొన్ని వర్గాల నుంచి వినిపిస్తున్న భారత్ వ్యతిరేక నినాదాలు కేవలం రాజకీయ ప్రేరేపితమైనవని.. వాటితో తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు.
రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నా.. వ్యాపార, ఆర్థిక సహకారం కొనసాగుతుందని బంగ్లాదేశ్ స్పష్టం చేసింది. దీనిలో భాగంగా భారత్ నుంచి 50,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని దిగుమతి చేసుకోవాలని నిర్ణయించినట్లు అహ్మద్ ధ్రువీకరించారు. ఇది ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసే దిశగా ఒక ముఖ్యమైన అడుగు అని ఆయన అభివర్ణించారు. కాగా.. పాకిస్థాన్ నుంచి కూడా మరో 50,000 టన్నుల బియ్యం కొనుగోలు చేయాలని యూనస్ ప్రభుత్వం భావిస్తోంది.
అసలు గొడవలకు కారణం ఏంటంటే?
ఢాకా నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి, తీవ్రవాద నాయకుడు ఉస్మాన్ హాదీ హత్య తర్వాత బంగ్లాదేశ్లో భారత్ వ్యతిరేక నిరసనలు మిన్నంటాయి. భారత రాయబార కార్యాలయాలపై దాడులు జరగడంతో భారత్ వీసా సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. మరోవైపు బంగ్లాదేశ్లో దీపు చంద్ర దాస్ అనే హిందూ కార్మికుడిని.. అత్యంత క్రూరంగా కొట్టి చంపారు, ఈ హత్యను నిరసిస్తూ న్యూఢిల్లీలోని బంగ్లా హైకమిషన్ వద్ద నిరసనలు వెల్లువెత్తాయి. దీనితో బంగ్లాదేశ్ కూడా తన వీసా సేవలను నిలిపి వేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa