బంగ్లాదేశ్లో ప్రస్తుత పరిస్థితులు అత్యంత భయానకంగా ఉన్నాయని, మైనారిటీల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం మైనారిటీలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో విఫలమవ్వడమే కాకుండా.. అరాచక శక్తులకు వత్తాసు పలుకుతోందని ఆమె మండిపడ్డారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని గురువారం ఆమె విడుదల చేసిన ఒక ప్రకటనలో ప్రస్తుత ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు.
సజీవ దహనాలు.. అంతులేని అకృత్యాలు
ముస్లిమేతర సమాజంపై, ముఖ్యంగా హిందువులపై జరుగుతున్న దాడులను ప్రస్తావిస్తూ షేక్ హసీనా ఆవేదన వ్యక్తం చేశారు. "బంగ్లాదేశ్లో మైనారిటీలను సజీవ దహనం చేసే దుర్మార్గపు సంప్రదాయానికి ఈ ప్రభుత్వం తెరలేపింది. ముస్లిమేతరులపై వర్ణనాతీతమైన అకృత్యాలు జరుగుతున్నాయి. మత స్వేచ్ఛను హరిస్తూ, ప్రజలు తమ విశ్వాసాలను పాటించకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారు" అని ఆమె ధ్వజమెత్తారు. ఇటీవల మైమెన్సింగ్లో 25 ఏళ్ల హిందూ యువకుడిని గుంపుగా చేరి కొట్టి చంపిన ఘటనను ఆమె ఉదాహరణగా పేర్కొన్నారు. బంగ్లాదేశ్ ప్రజలు ఈ చీకటి రోజులను ఎంతో కాలం సహించబోరని ఆమె హెచ్చరించారు.
మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వానికి పాలించే నైతిక హక్కు లేదని షేక్ హసీనా స్పష్టం చేశారు. "ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైనది కాదు. కేవలం ఒక తిరుగుబాటు ద్వారా అధికారాన్ని చేజిక్కించుకున్నారు. చట్టబద్ధత లేని ఈ పాలనలో ప్రజల ప్రాణాలకు విలువ లేకుండా పోయింది" అని ఆమె పేర్కొన్నారు. ఇదే సమయంలో క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ.. యేసుక్రీస్తు చూపిన మార్గంలో చీకటి తొలగి వెలుగులు రావాలని, బంగ్లాదేశ్లో మత సామరస్యం మళ్లీ వెల్లివిరియాలని ఆమె ఆకాంక్షించారు.
షేక్ హసీనా ఈ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలోనే బంగ్లాదేశ్లో మరో దారుణం వెలుగు చూసింది. రాజ్బరీ జిల్లాలో అమృత్ మండల్ అనే వ్యక్తిని గ్రామస్థుల బృందం దారుణంగా కొట్టి చంపింది. దౌర్జన్యంగా వసూళ్లకు పాల్పడుతున్నాడనే ఆరోపణతో బుధవారం రాత్రి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. అంతకుముందు 27 ఏళ్ల దీపు చంద్ర దాస్ను కూడా ఇదే తరహాలో కొట్టి చంపడం కలకలం రేపింది. వరుసగా జరుగుతున్న ఈ హత్యాకాండలు బంగ్లాదేశ్లో మైనారిటీల భద్రతపై అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ పరిణామాలు చూస్తుంటే.. బంగ్లాదేశ్లో రాజకీయ అస్థిరతతో పాటు మతపరమైన చిచ్చు మరింత ముదురుతున్నట్లు కనిపిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa