అబుదాబి వేదికగా ఇటీవల ఐపీఎల్ 2026 మినీ వేలం జరిగిన సంగతి తెలిసిందే. కామెరాన్ గ్రీన్ అత్యధిక ధర పలికాడు. రూ.25.2 కోట్లకు ఈ ఆస్ట్రేలియా ఆల్రౌండర్ను కేకేఆర్ సొంతం చేసుకుంది. శ్రీలంక ప్లేయర్ మతీషా పథిరనను కూడా రూ.18 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ వేలంలో మొత్తం 13 మంది ప్లేయర్లను కొనుగోలు చేసిన కేకేఆర్.. ఆక్షన్కు ముందు, గతేడాది రూ.23.75 కోట్లతో కొనుగోలు చేసిన వెంకటేశ్ అయ్యర్ను రిలీజ్ చేసింది. ఈ ప్లేయర్ను ఐపీఎల్ 2026 మినీ వేలంలో ఆర్సీబీ రూ.7 కోట్లకు కొనుగోలు చేసింది. ఇంత వెచ్చించి దక్కించుకున్నా.. ఇతడు ప్లేయింగ్ ఎలెవన్లో ఆడే ఆవకాశం లేదని తెలుస్తోంది. ఈ మేరకు ఆర్సీబీ మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే కీలక వ్యాఖ్యలు చేశారు.
తాజాగా ఐపీఎల్ వేలం గురించి మాట్లాడిన మాజీ టీమిండియా, ఆర్సీబీ కెప్టెన్ అనిల్ కుంబ్లే.. ఫ్రాంచైజీ తక్షణ మార్పుల కంటే ప్రస్తుతం ఉన్న దాన్ని కొనసాగించడానికే ప్రాధాన్యత ఇచ్చిందని అన్నాడు. అందులో భాగంగా వెంకటేష్ అయ్యర్.. ఐపీఎల్ 2026 ప్రారంభంలో ప్లేయింగ్ ఎలెవన్లో ఉండడని చెప్పాడు. విజయాలు సాధిస్తున్న జట్టులో అనవసరంగా మార్పులు చేయకూడదని ఆర్సీబీ భావిస్తున్నట్లు కుంబ్లే అన్నాడు. అంతేకాకుండా, జట్టులో ఇప్పటికే ఉన్న యువ ఆటగాళ్లకు మద్దతు ఇవ్వాలని ఆర్సీబీ భావిస్తున్నట్లు చెప్పాడు. ఇక మినీ వేలంలో లెగ్-స్పిన్నర్ రవి బిష్ణోయ్ను దక్కించుకునేందుకు ఆర్సీబీ ఎక్కువ ప్రయత్నం చేయలేదన్నాడు. ఎందుకంటే సీనియర్ ప్లేయర్ జట్టులోకి వస్తే.. తన స్థానం పోతుందేమోనన్న భయం సుయాష్ శర్మకు ఉండకూడదనే ఆర్సీబీ అలా చేసిందని చెప్పాడు అనిల్ కుంబ్లే.
కాగా, భారత మాజీ ఆల్రౌండర్ సంజయ్ బంగర్ కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశాడు. వెంకటేశ్ అయ్యర్ మంచి ప్లేయర్ అని చెబుతూనే.. అన్ని విధాలా పర్ఫెక్ట్గా ఉన్న జట్టులో.. స్థానం దక్కడం ఎంత కష్టమో చెప్పాడు. ఆర్సీబీ భవిష్యత్తు ప్రణాళికల్లో వెంకటేశ్ అయ్యర్ భాగమని తెలిపాడు. గత సీజన్లో కృనాల్ పాండ్య విషయంలో చేసినట్లుగా.. ఇప్పుడు అయ్యర్ను క్రమంగా జట్టులోకి తీసుకువచ్చే అవకాశం ఉందని బంగర్ పేర్కొన్నాడు.
వెంకటేశ్ అయ్యర్ రూ.2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చాడు. ఇతడిపై లక్నో సూపర్ జెయింట్స్ ప్రారంభంలో ఆసక్తి కనబరిచింది. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్, కేకేఆర్ బిడ్డింగ్ వేశాయి. చివరికి ఆర్సీబీ ఈ ఆల్రౌండర్ను దక్కించుకుంది. అయ్యర్ 56 ఐపీఎల్ ఇన్నింగ్స్లలో 29.12 సగటుతో 1,468 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 12 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa