భారతదేశంలో కొంత కాలంగా క్విక్ కామర్స్ రంగం పుంజుకుంటున్న సంగతి తెలిసిందే. జనం అంతా ఆన్లైన్ షాపింగ్కు అలవాటైపోయారు. ఏది కావాలన్నా.. ఆన్లైన్లోనే ఎక్కువగా ఆర్డర్ చేసుకుంటున్నారు. ఒకప్పుడు కేవలం ఫుడ్, దుస్తుల వరకే పరిమితం కాగా.. ఇప్పుడు ఏ చిన్న వస్తువు కోసమైనా ఆన్లైన్కే మొగ్గుచూపుతున్నారు. ఇందుకోసం.. క్విక్ కామర్స్ సెక్టార్లో నిమిషాల్లోనే మీకు కావాల్సిన వస్తువుల్ని డెలివరీ చేసేందుకు స్విగ్గీ ఇన్స్టామార్ట్, జొమాటోకు చెందిన బ్లింకిట్, జెప్టో ఇలా చాలానే ఉన్నాయి. ఇందులో కూడా వేలల్లో పని చేస్తుంటారు. భారతదేశంలో క్విక్ కామర్స్ వినియోగం.. ఏ స్థాయికి చేరుకుందో తాజాగా విడుదలైన స్విగ్గీ ఇన్స్టామార్ట్ రిపోర్ట్ తెలియజేస్తుంది.
2025 ఏడాదిలో స్విగ్గీ ఇన్స్టామార్ట్ ద్వారా జనం ఎక్కువగా ఏమేం ఆర్డర్ చేశారు అనే దాని గురించి రిపోర్ట్ విడుదల చేసింది. ఇందులో నిత్యావసరాల నుంచి మొదలుకొని.. గోల్డ్, ఐఫోన్స్ ఇలా ఎంతో విలువైన వస్తువులు కూడా ఉన్నాయి. వీటి గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. గతంలో ఇండియా- పాకిస్థాన్ మ్యాచ్ రోజుకు సంబంధించి ఆర్డర్స్ గురించి కూడా స్విగ్గీ రిపోర్ట్ విడుదల చేసింది.
>> కొచ్చికి చెందిన ఒక వ్యక్తి.. ఒక్క ఏడాదిలోనే ఏకంగా 368 సార్లు కరివేపాకు (కర్రీ లీవ్స్) ఆర్డర్ చేశాడు. అంటే సగటున రోజూ కరివేపాకు ఆర్డర్ చేశాడన్నమాట. ఇదే సమయంలో చెన్నైకి చెందిన ఒక వ్యక్తి మాత్రం.. ఏడాది పొడవునా కండోమ్స్ కోసం ఏకంగా రూ. 1 లక్షకుపైగా వెచ్చించాడు. ఇక్కడ 228 కండోమ్స్ (228 రోజులు) కోసం వేర్వేరు సార్లు కలిపి మొత్తంగా రూ. 1,06,398 వెచ్చించాడు. ముంబై వ్యక్తి స్విగ్గీ ఇన్స్టామార్ట్ ద్వారా ఏకంగా రూ. 15.16 లక్షల విలువైన బంగారాన్ని కొనుగోలు చేయడం విశేషం.
ఐఫోన్ల కొనుగోలు కోసం కూడా స్విగ్గీ ఇన్స్టామార్ట్ను వినియోగించారు కొందరు కస్టమర్లు. ఇందులో హైదరాబాద్కు చెందిన ఒక వ్యక్తి.. లేటెస్ట్ ఐఫోన్స్ కోసం రూ. 4.30 లక్షలు వెచ్చించాడు. అత్యంత తక్కువగా చూస్తే బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి.. రూ. 10 ఖర్చు చేసి ప్రింట్ అవుట్స్ తెప్పించుకున్నారు. ఒక వ్యక్తి.. డెలివరీ బాయ్స్కు ఏడాదిలో ఏకంగా రూ. 68,600 టిప్పుగా ఇచ్చారు.
ఈ సంవత్సరం మెట్రో సిటీల కంటే టైర్-2 నగరాలు క్విక్ కామర్స్ సెక్టార్లో గణనీయమైన వృద్ధిని కనబరిచాయి. ఇక్కడ గతేడాది కంటే ఏకంగా 10 రెట్ల వృద్ధిని నమోదు చేసిన రాజ్కోట్లో ఇందులో టాప్లో నిలిచింది. లుధియానాలో 7 రెట్లు, భువనేశ్వర్లో 4 రెట్ల వృద్ధి కనిపించింది. టైమింగ్స్ చూస్తే ఉదయం 7-11 గంటల మధ్య.. మళ్లీ సాయంత్రం 4-7 మధ్య అత్యధిక ఆర్డర్స్ వచ్చాయి. ఎక్కువగా ఇతరులకు బహుమతులు పంపించేందుకు సోమవారం రోజు ఆర్డర్స్ ఎక్కువగా చేశారు. నిత్యావసరాల్లో పెరుగు, కరివేపాకు, గుడ్లు, పాలు, అరటి పండ్లు వంటివి ఎక్కువగా ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa