ఏపీ ప్రభుత్వం భూముల రీసర్వే చేపడుతున్న సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వ హయాంలో భూముల సర్వే జరిగింది. అయితే ఈ సర్వేలో పొరపాట్లు జరిగాయంటూ ఏపీలోని టీడీపీ కూటమి సర్కారు.. భూముల రీసర్వే చేపడుతోంది. ఈ క్రమంలోనే అనకాపల్లి జిల్లాలో నాలుగో విడత భూముల రీసర్వే చేపట్టనున్నారు. జనవరి 2వ తేదీ నుంచి నాలుగో విడత భూముల రీసర్వే ప్రారంభం కానుంది. గతంలో జరిగిన పొరపాట్లు, తప్పులు మరోసారి పునరావృతం కాకుండా ఈసారి అధికారులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పక్కా కొలతలతో భూములను గుర్తించి.. ఆన్లైన్లో నమోదు చేసేలా భూముల రీసర్వే చేపట్టనున్నారు. మరోవైపు అనకాపల్లి జిల్లాలో నాలుగో విడత భూముల రీసర్వే 63 గ్రామాల పరిధిలో జరగనుంది.
ఎంపిక చేసిన ఈ 63 గ్రామాలలో..182 రోజుల్లోగా నాలుగో విడత భూముల రీసర్వే పూర్తి చేయాలన్న లక్ష్యంతో అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. సర్వేపై ఇప్పటికే గ్రామసభల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. వైసీపీ హయాంలో చేసిన భూముల సర్వేలో తప్పులు దొర్లాయని.. విస్తీర్ణంలో తప్పులతో పాటుగా జాయింట్ ఎల్పీ నంబర్లతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం చెప్తోంది. ఈ నేపథ్యంలోనే భూముల రీసర్వే ప్రక్రియ చేపడుతోంది. ఇందులో భాగంగా అనకాపల్లి జిల్లాలోని 733 గ్రామాల్లో రీసర్వే చేయాల్సి ఉండగా... 488 గ్రామాల్లో సర్వే పూర్తి చేశారు. మూడు విడతలుగా సర్వే ప్రక్రియ చేపట్టారు.
తాజాగా నాలుగో విడత భూముల రీసర్వే కింద ఎంపిక చేసిన 63 గ్రామాల్లోని 1.28 లక్షల ఎకరాల్లో రీసర్వే జరగనుంది. ఈ 63 గ్రామాలలో.. 37 గ్రామాలు నర్సీపట్నం డివిజన్లోనే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు రీసర్వే పూర్తి అయిన తర్వాత రైతులకు ప్రభుత్వం కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేయనుంది.
ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలను రైతులకు అందించనుంది. రీసర్వే పూర్తి అయిన గ్రామాల్లో రైతులకు త్వరలోనే కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు అందిస్తామని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఇటీవల వెల్లడించారు. మరోవైపు పట్టాదారు పాసుపుస్తకాలలో ఎలాంటి తప్పులు లేకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. దీంతో కొన్నిచోట్ల ఆలస్యమవుతోందనే వాదనలు ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa