ఈ ఏడాది ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ సైన్యం ఆపరేషన్ సిందూర్ చేపట్టిన పాకిస్థాన్ కూసాలను కదిలించింది. దెబ్బకు దాయాది మూడు రోజుల్లోనే కాళ్లబేరానికి వచ్చి, కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రతిపాదించింది. ఇక, ఆపరేషన్ సిందూర్ పాకిస్థాన్ నాయకత్వం వెన్నులో వణుకుపుట్టించినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు పాక్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ చెప్పిన మాటలే ఉదాహరణ. సిందూర్ సమయంలో తనను బంకర్లో దాక్కోమని సైన్యం సలహా ఇచ్చినట్టు స్వయంగా ఆయన వెల్లడించారు.
ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న జర్దారీ మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్తో భారత్ సైన్యం దాడులు ప్రారంభమైన వెంటనే సైనిక కార్యదర్శి తన వద్దకు వచ్చిన బంకర్లోకి వెళ్లాలని సూచించారని చెప్పారు. ‘‘అతడు (సైనిక కార్యదర్శి) నా దగ్గరకు వచ్చి యుద్ధం మొదలైందని చెప్పాడు.. మీరు వెంటనే బంకర్లోకి వెళ్లండి అని సూచించారు.. కానీ నేను వీరమరణం వస్తే అది ఇక్కడే అని నేను అతడికి చెప్పాను.. నాయకులు బంకర్లో చనిపోరు... యుద్ధభూమిలో మరణిస్తారు..’ అని పాక్ అధ్యక్షుడు తెలిపారు. అంతేకాదు, యుద్ధ వస్తుందని తనకు నాలుగు రోజుల ముందే తెలుసని చెప్పారు.
జర్దారీ వ్యాఖ్యలపై భారత సైన్యం రిటైర్డ్ అధికారి స్పందిస్తూ.. యావత్ పాక్ నాయకత్వం, సైన్యం బంకర్లలో దాక్కున్నాయని తెలిపారు. ‘భారత్ దాడిచేసినప్పుడు అసిమ్ మునీర్ సైతం బంకర్లోకి వెళ్లిపోయాడు.. పాకిస్తాన్ రాజకీయ నాయకత్వం, సైనిక కమాండర్లు బంకర్లలో దాక్కున్నారు.. కేవలం సైనికులు మాత్రమే పోరాటం చేసి ప్రాణాలు కోల్పోయారు.. యుద్ధం వస్తుందని నాలుగు రోజుల ముందే తెలుసని ఆయన (జర్దారీ) అబద్దాలు చెబుతున్నాడు.. ఒకవేళ నాలుగు రోజులు ముందే తెలిస్తే తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేస్తే ఒక్క క్షిపణిని కూడా అడ్డుకోలేకపోయారు ఎందుకు’ అని రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ ధిల్లాన్ ఏఎన్ఐతో అన్నారు.
పహల్గామ్లో 26 మంది అమాయకుల ప్రాణాలు తీసిన పాకిస్థాన్ ఉగ్రవాదులపై ఆపరేషన్ సిందూర్తో భారత్ ప్రతీకారం తీర్చుకుంది. మే 7వ తేదీన తెల్లవారుజామున ఆపరేషన్ సిందూర్ చేపట్టి పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోకి చొచ్చుకెళ్లి జైషే మహమ్మద్, లష్కరే తొయిబా, హిజ్బుల్ ముజాయిద్దీన్ ఉగ్రవాద సంస్థలకు చెందిన మొత్తం 9 స్థావరాలను ధ్వంసం చేసింది. పాక్ ఏం జరిగిందో తెలుసుకునేలోపే 25 నిమిషాల్లోనే ఆపరేషన్ ముగించి, భారత సైన్యం వెనక్కి వచ్చింది. ఈ పరిణామాలతో పాకిస్థాన్ ప్రతికార దాడులకు ప్రయత్నించగా.. భారత్ తిప్పికొట్టింది. రఫేల్, ఎస్ 400 క్షిపణి వ్యవస్థలతో పాక్ దుమ్ముదులిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa