ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతి జిల్లా దామినేడులో స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి భూములు కేటాయించింది. దామినేడులో నేషనల్ స్టాండర్డ్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు కోసం గతంలో 28.37 ఎకరాల భూమిని ఏపీ టూరిజం అథారిటీకి కేటాయించారు. అయితే ఆ ప్రాజెక్టు దిశగా అడుగులు పడకపోవటంతో.. తాజాగా జరిగిన ఏపీ మంత్రిమండలి సమావేశంలో ఈ భూమిని స్పోర్ట్స్ సిటీ నిర్మాణం కోసం శాప్కు ఇవ్వాలని నిర్ణయించారు ఈ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం లభించటంతో దామినేడులో 28.37 ఎకరాల భూమిని ఉచితంగా శాప్కు బదిలీ చేయనున్నారు.
మరోవైపు రాజధాని అమరావతిలో ఏపీ ప్రభుత్వం అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి ప్రణాళికలు రచిస్తున్న సంగతి తెలిసిందే. దీనితో పాటుగా ప్రతి నియోజకవర్గంలోనూ క్రికెట్ గ్రౌండ్లు ఉండేలా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా క్రికెట్ మైదానాలు, స్పోర్ట్స్ సిటీల నిర్మాణం ఆలోచన చేస్తోంది. ఈ క్రమంలోనే శాప్ ( Sports Authority of Andhra Pradesh) ఆధ్వర్యంలో తిరుపతిలో స్పోర్ట్స్ సిటీ నిర్మించాలని నిర్ణయించారు. ఈ స్పోర్ట్స్ సిటీ నిర్మాణం కోసం తిరుపతి రూరల్ మండలం దామినేడు ప్రాంతాన్ని ఎంపిక చేశారు. ఇక్కడ ఉన్న 28.37 ఎకరాలను టూరిజం అథారిటీ నుంచి శాప్కు ఉచితంగా బదిలీ చేస్తూ ఇటీవలే రెవెన్యూశాఖ నిర్ణయం తీసుకుంది.
ఈ ప్రతిపాదనలకు తాజాగా జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో ఆమోదం లభించింది. మరోవైపు దామినేడులో ఎకరా భూమి విలువ సుమారుగా రెండున్నర కోట్ల వరకూ ఉన్నట్లు సమాచారం. దీంతో 28 ఎకరాల భూమిని ఉచితంగా కేటాయిస్తూ ఉండటంతో.. అధికారులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేటాయించిన భూమిని అవసరాలకు మాత్రమే వినియోగించాలని.. రెవెన్యూ శాఖ అనుమతి లేకుండా ఈ భూమిలో ఎలాంటి కేటాయింపులు, బదిలీలు చేయొద్దని సూచించినట్లు సమాచారం.
మరోవైపు దామినేడు వద్ద ఉన్న భూమిని శాప్కు కేటాయించాలంటూ శాప్ చైర్మన్ రవి నాయుడు గతంలో సీఎం చంద్రబాబును కలిసి కోరారు. తిరుపతిలో క్రీడల్ని ప్రొత్సహించేందుకు, స్పోర్ట్స్ సిటీ నిర్మాణం కోసం భూమిని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తికి సీఎం చంద్రబాబు అప్పట్లో సానుకూలంగా స్పందించారు. తాజాగా భూమిని కూడా కేటాయించడంతో తిరుపతిలో స్పోర్ట్స్ సిటీ నిర్మాణం వేగం పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు తిరుపతిలోని గొల్లవానిగుంటలో కూడా ఓ క్రికెట్ స్టేడియం సిద్ధమైంది.
రూ.3 కోట్లు ఖర్చు చేసి గొల్లవానిగుంటలో క్రికెట్ స్టేడియం నిర్మాణం చేపట్టారు. ఈ పనులు చివరి దశకు చేరుకోగా.. సంక్రాంతి నాటికి పూర్తి చేసి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ స్టేడియంలో.. 75 చదరపు గజాల విస్తీర్ణంలో 5 వికెట్ టర్ఫ్లు ఏర్పాటు చేశారు. నాలుగు నెట్లు, గ్యాలరీలు, వీఐపీలకు ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa