ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశ రాజధాని గగనతలంపై ‘సుదర్శన చక్ర’.. కేంద్రం ఆమోదం

national |  Suryaa Desk  | Published : Tue, Dec 30, 2025, 10:03 PM

దేశ రాజధాని ఢిల్లీలో భద్రతకు సంబంధించి కేంద్రంలోని మోదీ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం మొత్తం రూ.5,181 కోట్లతో స్వదేశీ సమీకృత గగనతల రక్షణ ఆయుధ వ్యవస్థను కొనుగోలు చేయడానికి అనుమతించినట్టు సమాచారం. విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఈ మేరకు జాతీయ మీడియా కథనం వెల్లడించింది. ‘సుదర్శన చక్ర’ ఫ్రేమ్‌వర్క్‌లో భాగంగా పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద ఢిల్లీలోని ముఖ్యమైన వీఐపీ-89 జోన్‌లో ఈ వ్యవస్థను ఏర్పాటుచేయనున్నట్టు ఆ కథనం తెలిపింది.


డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థ దేశ రాజధాని చుట్టూ 30 కి.మీ. పరిధిలోని గగనతలంలో ఎటువంటి ముప్పునైనా నిరోధించగలదని సదరు వర్గాలు తెలిపాయి. అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో డ్రోన్ల వంటి ఆయుధాల ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో మోదీ సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సైనిక సామర్థ్యాలను మరింత బలోపేతం చేసేలా రూ.79 వేల కోట్ల విలువైన ఆయుధాలను కొనుగోలుచేయడానికి రక్షణ శాఖ సోమవారం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఈ గగనతల రక్షణ వ్యవస్థ కొనుగోలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ ఏడాది ఆగస్టు 15 ప్రసంగంలో గగనతల రక్షణ వ్యవస్థ గురించి ప్రకటించారు. ‘సుదర్శన్‌ చక్ర’ పేరుతో కీలక ప్రాంతాలను వైమానిక దాడుల నుంచి రక్షించేలా బహుళ అంచెల కవచం, ప్రతిదాడి వ్యవస్థలను మోహరించనున్నట్లు తెలిపారు. దేశంలోని వ్యూహాత్మక, పౌర, జాతీయ ప్రాధాన్యత కలిగిన ప్రాంతాల భద్రతే దీని లక్ష్యం. ఇందులో భాగంగా శత్రువులు ప్రయోగించే క్షిపణులు, యుద్ధ విమానాలను ముందుగానే గుర్తించి, కూల్చివేసే వ్యవస్థలను అభివృద్ధి చేయనున్నారు. అలాగే, సైబర్‌ దాడులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని కూడా ఈ వ్యవస్థలో అనుసంధానిస్తారు.


డీఆర్డీవో, సైన్యం, ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో దీన్ని ఏర్పాటు చేయడానికి కేంద్రం ఇప్పటికే సన్నాహకాలు ప్రారంభించింది. ఢిల్లీలో పైలట్ ప్రాజెక్ట్‌గా చేపడుతున్నట్టు అధికారులు తెలిపారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత గగనతల భద్రతను పటిష్టం చేయాలని భారత్ నిర్ణయించింది. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులకు దాయాది రగిలిపోయింది. సరిహద్దుల్లోని భారత సైనిక, వైమానిక స్థావరాలపై దాడులకు ప్రయత్నించగా.. వాటిని సైన్యం సమర్ధవంతంగా అడ్డుకుంది. ఎస్-400 వంటి గగనతల రక్షణ వ్యవస్థలను భారత్ వినియోగించింది. అంతేకాదు, పాక్‌పై ఎదురుదాడి చేసి, దాని మౌలిక వసతులు, సైనిక స్థావరాలపై విరుచుకుపడింది. పాక్ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ సహా కీలకమైన వ్యవస్థలను ధ్వంసం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa