2020 జూన్లో భారత్, చైనా సరిహద్దుల్లోని గల్వాన్ లోయలో రెండు దేశాల సైన్యం మధ్య జరిగిన ఘర్షణల నేపథ్యంలో సల్మాన్ ఖాన్ ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ అనే టైటిల్ పెట్టారు. అయితే ఈ బాటిల్ ఆఫ్ గల్వాన్ సినిమాపై చైనా అభ్యంతరాలు వ్యక్తం చేయడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. ఈ సినిమా నిజాలను వక్రీకరిస్తోందంటూ చైనీస్ మీడియా చేస్తున్న విమర్శలపై భారత ప్రభుత్వ వర్గాలు ధీటుగా స్పందించాయి.
బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ సినిమాపై చైనా ప్రభుత్వ పత్రిక గ్లోబల్ టైమ్స్ చేసిన విమర్శలపై భారత ప్రభుత్వ వర్గాలు తాజాగా స్పందించాయి. మన దేశంలో కళాత్మక స్వేచ్ఛ ఉందని గుర్తుచేశాయి. భారతదేశంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉందని పేర్కొన్నాయి. ఇందులో భాగంగానే చిత్ర నిర్మాతలు తమకు నచ్చిన విధంగా సినిమాలు తీసుకునే హక్కు కలిగి ఉన్నారని స్పష్టం చేశాయి.
ఈ బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ సినిమాపై గ్లోబల్ టైమ్స్ ప్రచురించిన ఓ కథనం ఇప్పుడు ఈ వివాదానికి కారణం అయింది. గల్వాన్ లోయ చైనా భూభాగంలో ఉందని గ్లోబల్ టైమ్స్ తప్పుడు వాదనలు చేసింది. బాలీవుడ్ సినిమాలు కేవలం ఎమోషన్స్తో కూడిన ఎంటర్టైన్మెంట్ను మాత్రమే ఇస్తాయని.. అంతేకానీ సినిమా అతిశయోక్తులు చరిత్రను మార్చలేవని వ్యాఖ్యానించింది. గల్వాన్ లోయలో భారత్ కావాలనే కవ్వింపు చర్యలకు దిగిందని చైనా ఆరోపిస్తోంది.
2020 జూన్ నెలలో తూర్పు లడఖ్లోని గల్వాన్ లోయలో భారత-చైనా సైనికుల మధ్య భీకరమైన ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఆ ఘటనపై బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ సినిమాను తీస్తున్నారు. గల్వాన్ ఘర్షణలో వీరమరణం పొందిన 16 బిహార్ రెజిమెంట్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు పాత్రను.. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ పోషిస్తున్నారు.
ఇక ఆ ఘర్షణలో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు భారత్ అధికారికంగా ప్రకటించింది. కానీ చైనా మొదట మరణాలను దాచిపెట్టి.. ఆ తర్వాత కేవలం నలుగురు సైనికులు మాత్రమే చనిపోయారని ప్రపంచదేశాలను నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ భారత్తో పోల్చితే చైనా సైనికులు అధికంగా చనిపోయారని అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa