వెనిజులా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం బంధించిన ఘటనపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. లక్సెంబర్గ్ పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఈ పరిణామాలపై స్పందిస్తూ.. వెనిజులాలో శాంతియుత పరిస్థితులు నెలకొనాలని ఆకాంక్షించారు. చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని ఇరు పక్షాలకు ఆయన విజ్ఞప్తి చేశారు.
వెనిజులాతో భారత్ అనుబంధం..
వెనిజులాతో భారత్కు దశాబ్దాలుగా అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని జైశంకర్ గుర్తు చేశారు. ఆ దేశ ప్రజల భద్రత, శ్రేయస్సు తమకు అత్యంత ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. కారకాస్లో ఉన్న భారత రాయబార కార్యాలయం అక్కడ నివసిస్తున్న భారతీయులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని వివరించారు. ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో భారతీయులు ఎవరూ అత్యవసరం అయితే తప్ప వెనిజులాకు ప్రయాణించ వద్దని ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది.
జనవరి 3వ తేదీ రోజు అమెరికా డెల్టా ఫోర్సెస్ కారకాస్పై దాడి చేసి నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్ను బంధించి వాషింగ్టన్కు తరలించింది. వారిపై నార్కో-టెర్రరిజం, డ్రగ్ ట్రాఫికింగ్ వంటి తీవ్రమైన ఆరోపణలను మోపింది. సోమవారం న్యూయార్క్ కోర్టులో హాజరైన మదురో.. తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చారు. తాను అమాయకుడినని, తనను అమెరికా అపహరించిందని చెప్పారు. తాను వెనిజులా చట్టబద్ధమైన అధ్యక్షుడినని పేర్కొంటూ.. తనను తాను యుద్ధ ఖైదీగా ప్రకటించుకున్నారు.
మరోవైపు మెక్సికోకు చెందిన సినలోవా కార్టెల్, కొలంబియా ఫార్క్ తిరుగుబాటుదారులతో కలిసి మదురో కొకైన్ అక్రమ రవాణాకు సహకరించారని అమెరికా ప్రాసిక్యూటర్లు ఆరోపిస్తున్నారు. 2000వ సంవత్సరం నుంచి ఆయన నేర కార్యకలాపాల్లో ఉన్నారని వాషింగ్టన్ పేర్కొంది. అయితే మదురో ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. వెనిజులాలో ఉన్న అపారమైన చమురు నిల్వలపై కన్నువేసిన అమెరికా.. వాటిని దక్కించుకునేందుకే తనను టార్గెట్ చేసిందని మండిపడ్డారు. వెనిజులాలో ప్రజాస్వామ్యం పునరుద్ధరణ పేరుతో అమెరికా చేస్తున్న ఈ చర్యలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెద్ద చర్చకు దారితీశాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa