ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్వరలోనే పాక్ ముక్కలవుతుంది.....లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కవీంద్ర గుప్తా

national |  Suryaa Desk  | Published : Tue, Jan 13, 2026, 08:21 PM

జమ్మూ కశ్మీర్‌లోని షాక్స్‌గమ్ లోయలో చైనా ప్రాజెక్ట్‌లు నిర్మాణంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తాజాగా, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కవీంద్ర గుప్తా మాట్లాడుతూ. ఆ ప్రాంతం భారత్‌ భూభాగమని, తక్షణమే అటువంటి చర్యలను నిలిపివేయాలని ఆయన స్పష్టం చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ప్రజలు సైతం భారత్‌లో కలవాలని కోరుకుంటున్నారని, ఆరోజు ఎంతో దూరంలో లేదని ఆయన వ్యాఖ్యానించారు. దీనికి ముందే పాకిస్థాన్ ముక్కలవడం ఖాయమని లెఫ్టినెంట్ గవర్నర్ జోస్యం చెప్పారు. చైనా-పాకిస్థాన్ మధ్య 1963లో కుదిరిన సరిహద్దు ఒప్పందం


1963 నాటి చైనా-పాకిస్తాన్ సరిహద్దు ఒప్పందం ప్రకారం.. ఇస్లామాబాద్ షాక్స్‌గామ్ లోయలో అక్రమంగా ఆక్రమించుకున్న 5,180 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనాకు అప్పగించింది. ఆ లోయలో చైనా చేపడుతున్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై భారతదేశం అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత భూభాగమైన ఆ ప్రాంతంలో తన ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకునే హక్కు తమకు ఉందని పేర్కొంది. దీనికి బీజింగ్ స్పందిస్తూ, ఆ ప్రాంతం చైనాలో భాగమని వాదించింది. ఈ ప్రాంతంలో చైనా కార్యకలాపాలు చట్టవిరుద్ధమని, వాటిని సహించలేమని లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ స్పష్టం చేశారు.


‘‘పాకిస్థాన్ కశ్మీర్‌లోని కొంత భాగాన్ని చట్టవిరుద్ధంగా ఆక్రమించింది... ఈ మేరకు భారత పార్లమెంటు కూడా 1994లో ఒక తీర్మానాన్ని ఆమోదించిందని వారు తెలుసుకోవాలి. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఒక వాతావరణం ఏర్పడుతోంది.. అక్కడి ప్రజలు కూడా భారతదేశంతో కలిసి ఉండాలని కోరుకుంటున్నారు. పాక్ స్వయంగా విచ్ఛిన్నమయ్యే రోజు ఎంతో దూరంలో లేదు. కాబట్టి, చైనా అటువంటి కార్యకలాపాలను ఆపాలి. భారత ప్రభుత్వం కూడా దీనిని పరిగణనలోకి తీసుకుంది.. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొంది’’ అని గుప్తా తెలిపారు.


‘‘చూడండి.. పాక్ ఒక అమ్ముడుపోయే దేశం. ఈ లోయను పాకిస్థాన్ ఆక్రమించుకుందని మేము నమ్ముతున్నాం.. ఆ దేశం కొంత డబ్బు సంపాదించడం కోసం చైనాను అక్కడికి అనుమతించడం వంటి పనులు చేస్తోంది. కానీ ఈ ప్రాంతం భారతదేశానికి చెందింది.. భారతదేశం దీనిని పూర్తిగా పరిగణనలోకి తీసుకుంటుంది. పాకిస్థాన్ గురించి చింతించకుండా, మేము మా పద్ధతిలో చర్య తీసుకుంటాం’’ అని హెచ్చరించారు. అలాగే, ఈ విషయంలో కేంద్రంలోని మోదీ సర్కారుపై ప్రతిపక్షాలు చేస్తోన్న విమర్శల గురించి స్పందిస్తూ.. జాతీయ ప్రయోజనాలే ముఖ్యమని, కాంగ్రెస్‌పై మండిపడ్డారు. ‘‘చూడండి, ఏ రాజకీయ పార్టీ అయినా, ప్రత్యేకించి విదేశాలకు వెళ్లి భారతదేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేసే కొన్ని పార్టీలు, జాతీయ ప్రయోజనాల కోసం తీసుకుంటున్న చర్యల గురించి మాట్లాడకూడదు’’ అని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa