రైలు ప్రయాణంలో ప్రయాణికులు ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో ఒకటి నాణ్యమైన ఆహారం, పానీయాలు. ముఖ్యంగా ప్యాంట్రీ కార్లలో ఇచ్చే టీ, కాఫీ రుచిపై తరచూ ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వస్తుంటాయి. అయితే సమస్యకు పరిష్కారం చూపుతూ వాల్తేరు రైల్వే డివిజన్ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు నాణ్యమైన, రుచికరమైన కాఫీ, టీలను అందించేందుకు అధునాతన వెండింగ్ యూనిట్లను అందుబాటులోకి తెచ్చింది. వాల్తేరు డివిజన్ డీఆర్ఎం లలిత్ బోహ్రో బుధవారం వీటిని ప్రారంభించారు. విశాఖపట్నం నుంచి న్యూఢిల్లీ వెళ్లే ఏపీ ఎక్స్ప్రెస్లో ఈ సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించారు.
మరోవైపు సాధారణంగా రైళ్లలో ప్యాంట్రీ కార్ సిబ్బంది టీ, కాఫీలను తయారు చేసి అందిస్తుంటారు. అయితే వెండింగ్ మెషీన్ల ద్వారా వీటిని అందించాలనే ఉద్దేశంతో వాల్తేరు డివిజన్ ఈ నిర్ణయం తీసుకుంది. వెండింగ్ మెషీన్ల వాడకం వల్ల చక్కెర, పాలు, టీ,కాఫీ పొడి సరైన నిష్పత్తిలో కలిసి, మంచి రుచిని అందిస్తాయని అధికారులు చెప్తు్న్నారు. వెండింగ్ మెషీన్ల నుంచి తీసిన పానీయాలను ప్రయాణికులకు చేరవేసేందుకు 5 లీటర్ల సామర్థ్యం గల ఇన్సులేటెడ్ క్యాన్లను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల చలికాలంలో, అలాగే రాత్రి సమయాల్లో కూడా టీ, కాఫీ వేడి తగ్గకుండా ఉంటాయని అధికారులు చెప్తున్నారు.
టీ, కాఫీ తయారీలో, పంపిణీలో పరిశుభ్రత పాటించేలా రైల్వే అధికారులు ప్రత్యేక నిబంధనలను విధించారు. మరోవైపు ఈ కొత్త సర్వీసు పట్ల ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సుదూర ప్రయాణం చేసే వారికి ఇది గొప్ప ఊరట కలిగిస్తోంది. ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే, వాల్తేరు డివిజన్ పరిధిలోని ఇతర ముఖ్యమైన రైళ్లలలో కూడా ఈ వెండింగ్ మెషీన్లను ఏర్పాటు చేసే ఆలోచనలో అధికారులు ఉన్నట్లు సమాచారం. వాల్తేరు డివిజన్ అధికారుల నిర్ణయంతో రైలు ప్రయాణికులకు నాణ్యమైన టీ, కాఫీలు అందనున్నాయి. మరోవైపు రైలు ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందీంచేందుకు, మెరుగైన సౌకర్యాల కల్పనకు రైల్వేశాఖ ఎప్పటికప్పుడు కొత్త చర్యలు చేపడుతూ ఉంటుంది. అందులో భాగంగానే ఈ కాఫీ, టీ వెండింగ్ యూనిట్లు ఏర్పాటు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa